హైదరాబాద్ : రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్ రోడ్మ్యాప్ నివేదికను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సమగ్ర నివేదికను తయారు చేయాలని సూచించారు. గత ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో నేతల సంక్షేమాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా.. నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం నేతన్నలకు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా, దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఉపాధి ఇస్తున్న టెక్స్లైల్ రంగాన్ని ఓ ప్రాధాన్యత రంగంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, ఈ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేశామన్నారు.
అంతర్జాతీయ కంపెనీలైన యంగ్ వన్, దేశీయ టెక్స్టైల్ దిగ్గజం కిటెక్స్ వంటి కంపెనీలు తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఇక్కడి మానవ వనరులను, ప్రభుత్వ పాలసీలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన మౌలిక వసతులు, నూతన పాలసీలు, నేతన్నల సంక్షేమానికి చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అనుబంధ రంగాల్లో తీసుకురావాల్సిన కార్యక్రమాలపై నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. దీంతో పాటు శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు బడ్జెట్లో పొందుపరచాల్సిన కార్యక్రమాలు, పథకాలపై తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో టెక్స్టైల్ కమిషనర్ శైలజా రామయ్యార్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.