తాండూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ( Vacancies ) భర్తీ చేయాలని సీపీఎం ( CPM ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో పార్టీ మండల కార్యదర్శి దాగాం రాజారాం కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారతదేశంలో యువశక్తి సామర్ధ్యాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు, విఫలమైతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగ హామీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల హామీని తక్షణమే అమలుచేసి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి దుర్గం నానయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఎ) మండల అధ్యక్షుడు బొల్లం రాజేశం, మొగిలి, రాములు, నాయకులు పాల్గొన్నారు.