Danam Nagender | బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు తప్పు చేశామోనని ప్రశ్చాత్తాపడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరితే తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. సీఎం రేవంత్ పాలనపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తనని తాను కాపాడుకొని పార్టీని గాలికి వదిలేశారంటూ ఖైరతాబద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రేవంత్ తీరుపై చురకలంటించారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని, కనీసం రూ. 10 కోట్ల నిధులు కూడా తెచ్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిధులు ఇవ్వట్లేదంటూ వ్యాఖ్యానించారు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ నేతలే కారణమని మరో బాంబు పేల్చాడు. తన ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫోటోలు ఉంటాయని, కేసీఆర్ ఒక సునామీ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఒకప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయిందన్న నోటితోనే బీఆర్ఎస్ను పొగడటం, కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమనే భావనలో దానం ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ గూటికి తిరిగి చేరడానికి తహతహలాడుతున్నట్లు సమాచారం. దానం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మరో జంపింగ్ ఎమ్మెల్యే పోచారం కూడా అంతర్మథనంలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుకోగా అదే బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తున్నది.