హైదరాబాద్ : పోలవరం ముంపును కప్పిపుచ్చేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలం పట్టణంతో పాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భద్రాచలం ప్రాంతానికి ముంపు ముప్పు కాళేశ్వరం వల్ల కాదని, దిగువన ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావం వల్లనే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం (CWC), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) కూడా అధికారికంగా గుర్తించిన అంశాన్ని మంత్రి ఉత్తమ్ తెలుసుకోవాలని పువ్వాడ సూచించారు.
పోలవరం ముంపు సమస్యపై ప్రజల దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు. భద్రాచలం వద్ద గోదావరి నది బెడ్ లెవల్ సుమారు 26 మీటర్ల లోతులో ఉండగా, పోలవరం బ్యాక్వాటర్ ప్రభావం కారణంగా అక్కడ ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల వరకు నీటి మట్టం నిల్వ ఉంటుందని, ఇదే భద్రాచలం ప్రాంతంలో ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ పోలవరం ముంపు నివారణకు భద్రాచలం ప్రాంత ప్రజల రక్షణకై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కనీస సమీక్ష జరపకుండా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.
పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంతో భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని 36 గ్రామాల పరిధిలో సుమారు 184 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి అత్యంత జఠిలమైన, ప్రజల జీవనానికి సంబంధించిన సమస్యను పక్కదారి పట్టిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలవరం బ్యాక్వాటర్ ముంపు సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి, భద్రాచలం ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిందని అజయ్ కుమార్ గుర్తు చేశారు.