PLI scheme | టెక్స్టైల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అప్పుడే టెక్స్టైల్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన కేటీఆర్.. పలు సూచనలు చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. ఈ పథకం ద్వారా చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి టెక్స్టైల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలను ఆకర్షించవచ్చని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల్లో ఈ పథకానికి సంబంధించిన ప్రోత్సాహకాలు మ్యాన్ మేడ్ ఫైబర్కు మాత్రమే వర్తిస్తాయని కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా ఉన్న కాటన్ సెగ్మెంట్ను ప్రోత్సహకాల విషయంలో పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. కాటన్ ఆధారిత టెక్స్టైల్ ఉత్పత్తులు చేసే వారికి సైతం ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తే అటు పరిశ్రమతో పాటు పత్తిని అధికంగా పండించే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోని రైతాంగం వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తద్వారా అన్ని రకాల ఫైబర్తో కూడిన నూతన పెట్టుబడులు టెక్స్టైల్ రంగంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కాటన్ సెగ్మెంట్కు సైతం ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో ఆశిస్తున్న 7.5 లక్షల ఉద్యోగాలను వేగంగా కల్పించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ ప్రోత్సాహకాలు పొందేందుకు నిర్ణయించిన నిర్ణీత కనీస పెట్టుబడిని తగ్గించాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. మ్యాన్ మేడ్ ఫైబర్ సెగ్మెంట్లో 300 కోట్ల రూపాయల కనీస పెట్టుబడిని ఈ పథకంలో ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హతగా నిర్ణయించారన్నారు. ఈ రంగంలో భారీ పెట్టుబడుల ద్వారానే చైనా వంటి దేశాలతో పోటీ పడటంసాధ్యమవుతుందన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుంటూనే.. ఈ రంగంలో అధునాతన యంత్రాలతో పెట్టుబడి పెట్టే స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్లకు సైతం ప్రోత్సహకాలు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గార్మెంట్ రంగంలో నిర్ణయించిన కనీస 100 కోట్ల పెట్టుబడి పరిమితిని రూ.50 కోట్లకు తగ్గించాలన్నారు. లేదంటే ఈ 100 కోట్ల పెట్టుబడితో ఒకే చోట సుమారు ఆరు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే స్థాయిలో యూనిట్లు ఏర్పాటు చేస్తేనే ఈ ప్రోత్సహకాలు అందే అవకాశం ఉంటుందన్న మార్గదర్శకాలను కొంత సవరించాలని కోరారు. గార్మెంట్ రంగంలో 50 కోట్ల పెట్టుబడితోనూ భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేశంలో ఉన్న రెడీమేడ్ గార్మెంట్ సెగ్మెంట్లో చాలావరకు చిన్న యూనిట్ లే ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఇవన్నీ కూడా వస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ సంస్థలకు సేవలు అందిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ చిన్న యూనిట్లను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
మెగా టెక్స్టైల్ పార్కుల ప్రోత్సహానికి మరో పథకం అవసరం
దేశంలోని భారీ టెక్స్టైల్ పార్కులకు ప్రత్యేక ప్రోత్సహాన్ని అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. టెక్స్టైల్ రంగంలో భారీగా పెట్టుబడులు రావాలంటే.. పెద్ద ఎత్తున భూమి, మౌలిక వసతుల కల్పన అవసరమని, ఇది కేవలం మెగా టెక్స్టైల్ పార్కుల ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో మెగా టెక్స్టైల్ పార్కులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇందుకు ఉదాహరణ అని, ఇక్కడ ఇప్పటికే యంగ్ వన్ వంటి అంతర్జాతీయ సంస్థతో పాటు దేశంలో ప్రముఖ గార్మెంట్ ఇండస్ట్రీ అయిన కిటేక్స్ గ్రూప్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సహకారంతో ఇలాంటి పార్కుల్లో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. ఇప్పటికే సిరిసిల్లలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంతో సుమారు 10 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే మేరకు పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.
ఈ సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తన పీఎల్ఐ పథకంలో మార్పులు చేయడం లేదా తమ సూచనలకు అనుగుణంగా మరో సమాంతర పథకాన్ని ప్రకటించడం ద్వారా వస్త్ర పరిశ్రమలోకి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు.