హైదరాబాద్: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) నిర్మిస్తున్న ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం 10.30 గంటలకు ఐటీ పార్కు పనులను మంత్రి ప్రారంభించనున్నారు.
తెలంగాణ గేట్వే పేరుతో నిర్మిస్తున్న ఈ ఐటీ పార్కును కండ్లకోయలోని 10.11 ఎకరాలల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండనున్న ఈ ఐటీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.250 కోట్లు వెచ్చించనునన్నది. దీంతో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
అనంతరం పూడూరులో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు.