రాజన్న సిరిసిల్ల : హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి, దేశానికే ఆదర్శవంతం కావాలి. ఇందుకోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడలో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
రాష్ట్రంలో రెండేండ్ల కింద తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి వైద్యారోగ్య సిబ్బంది అహర్నిశలు శ్రమించారని కేటీఆర్ కొనియాడారు. వారందరికీ మనం రుణపడి ఉండాలి. కరోనా సోకిన వారికి వైద్య సేవలందిస్తూ.. వైద్యులు, ఇతర సిబ్బంది తమ కుటుంబాలను మరిచిపోయారు. పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు లాక్ డౌన్ కాలంలో తీవ్రంగా శ్రమించారని ప్రశంసలు కురిపించారు
రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్రక్రియ చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఇంటికి వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వెళ్లి.. వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ట్యాబ్లో నమోదు చేసుకుంటారు. రక్త పరీక్షల కోసం నమూనాలను సేకరించి, సిరిసిల్ల టీ డయాగ్నోస్టిక్కు సెంటర్కు పంపిస్తారు. ఆ పరీక్షల వివరాలను కూడా నమోదు చేసుకుంటారని తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. హెల్త్ రికార్డులు సక్రమంగా నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడుతాయన్నారు. అలాంటప్పుడు రోగి వేలి ముద్ర లేదా ఐరిష్తో అన్ని రికార్డులు, వివరాలు తెలుసుకుని వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. అత్యవసర సమయంలో, విలువైన అర గంట సమయం కూడా వృధా కాకుండా ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. 60 రోజుల అనంతరం మిగతా జిల్లాల్లో అమలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
సిరిసిల్ల ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలిందని కేటీఆర్ తెలిపారు. కొంతమంది బీడీ కార్మికులు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు. ఇలాంటి రోగాలను నివారించేందుకు హెల్త్ ప్రొఫైల్ సర్వే ఉపయోగపడుతుందన్నారు. అవసరమైతే ఇక్కడ క్యాన్సర్ కేర్ సెంటర్, మరో చోట కార్డియాక్ సెంటర్ నెలకొల్పే అవకాశం ఉందన్నారు. డేటా ఆధారంగా, సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి, దేశానికే ఆదర్శవంతం కావాలి. ఇందుకోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని కేటీఆర్ చెప్పారు.