హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరికరం రూపొందించిన తీరు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. డివైజ్ రూపకర్త నర్సింహచారిని అభినందించారు. ఆవిష్కరణ అద్భుతంగా ఉందని, అందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఉత్పత్తికి పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఇన్స్టాషీల్డ్ లాంటి ఆవిష్కరణలకు ఊతం ఇస్తామని, గతంలో నర్సింహాచారి ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి ఎంపికయ్యారని, ఇప్పుడు ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఆవిష్కర్త చారి మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని వైరస్ల బారి నుంచి కాపాడేందుకు రెండేళ్లు శ్రమించి ఇన్స్టాషీల్డ్ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ దీన్ని చేర్చడమే తన జీవితాశయమన్నారు. కరోనా, డెల్టా, ఒమిక్రాన్ తదితర వైరస్లను నెగెటివ్ ఎలక్ట్రాన్ల సహాయంతో సంహరిస్తుందని, సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీన్ని ధ్రువీకరించాయని నర్సింహాచారి వివరించారు.