BRS | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కాలువలు నదుల్లో, నదులు సముద్రం లో కలిసినట్టే తెలంగాణలోని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్లో విలీనం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన వారు సైతం గులాబీ కండువా కప్పుకున్న చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటైన పలు పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమ, వ్యూహచతురత, ఆయనకున్న ప్రజాదరణ, ఆయనపై ఉన్న విశ్వాసం తదితర కారణాలతో తమ పార్టీలను బీఆర్ఎస్లో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు పూర్వం, తరువాత పీసీసీకి సుదీర్ఘకాలం అధ్యక్షులుగా పనిచేసిన నాయకులు కేసీఆర్ నాయత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని భావించి బీఆర్ఎస్లో చేరారు. గతం వారం, పది రోజులుగా రెండు పార్టీల అధ్యక్షులు, తెలంగాణ పీసీసీ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తాజాగా మరో పార్టీ వ్యవస్థాపకుడు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్లో విలీనమైన పార్టీలు,ప్రముఖులు
ఆలె నరేంద్ర: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సాధన సమితి (టీఎస్ఎస్)ను ఏర్పాటు చేసిన ఆలె నరేంద్ర అనతి కాలంలోనే కేసీఆర్ పోరాటపటిమ, వ్యూహచతురతను గుర్తించి దానిని బీఆర్ఎస్లో విలీనం చేశారు. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. అందులో కేసీఆర్తోపాటు ఆలె నరేంద్ర కూడా ఉన్నారు.
విజయశాంతి: తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన విజయశాంతి కూడా ఆ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయశాంతి ఎంపీగా ఎన్నికయ్యారు.
కే కేశవరావు: కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కే కేశవరావు సీడబ్ల్యూసీ సభ్యుడిగా, అనేక రాష్ర్టాలకు ఇన్చార్జీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, 2005-08 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని విశ్వసించి బీఆర్ఎస్లో చేరారు. కేకే రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి సెక్రటరీ జనరల్గా, రాజ్యసభ సభ్యుడిగా, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు.
డీ శ్రీనివాస్: ఉమ్మడి రాష్ట్రంలో 2004-05, 2008-11 కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డీ శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన పీసీసీ అధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని తలచిన డీఎస్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. డీఎస్ రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ రాజ్యసభకు పంపింది.
పొన్నాల లక్ష్మయ్య: తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా (2014-15), ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదన్న ఆగ్రహంతో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి జనగామ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఎల్ రమణ: మంత్రిగా, టీటీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్ రమణ.. 2006 కరీంనగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్పై పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని గ్రహించిన ఆయన బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఎర్రబెల్లి దయాకర్రావు: టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్రావు.. ఆ తరువాత రేవంత్రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ రాజకీయాల్లో అలజడి సృష్టించడాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్లో చేరారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దయాకర్రావు ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ‘తెలంగాణ వంటకాల’ను ఉద్యమరూపాలుగా ఆవిష్కరించారు. బీఆర్ఎస్లో క్రీయాశీలక పాత్ర పోషించిన ఆయన కొద్దికాలం పార్టీకి దూరంగా ఉండి ‘తెలంగాణ యువజనుల పార్టీ’ని స్థాపించారు. ఇటీవల తిరిగి బీఆర్ఎస్లో చేరారు.
చెరుకు సుధాకర్: తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్రమంతా చిరపరిచితమైన వ్యక్తి. సమైక్య పాలకులు తీవ్ర నిర్బంధాన్ని సృష్టిస్తే ప్రతిఘటించిన నాయకుడు. తొలి పీడీ యాక్ట్ను అనుభవించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ పార్టీకి కొంతకాలం దూరంగా ఉండి ‘తెలంగాణ ఇంటి పార్టీ’ని స్థాపించారు. ఇటీవల తిరిగి బీఆర్ఎస్లో చేరారు.
నాగం జనార్దన్రెడ్డి: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్దన్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో ఓబులాపురం మైనింగ్ కుంభకోణంపై పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీలో కొంతకాలం పనిచేశారు. తరువాత ‘తెలంగాణ నగారా’ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్లో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను కూడా బీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించడం విశేషం.