హైదరాబాద్ : ‘తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం’ పేరుతో హైదరాబాద్ జలమండలిలో ఓఎస్డీ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కన్నోజు మనోహరాచారి రచించిన పుస్తకాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో బుధవారం ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత వ్యవసాయం, పశుపోషణ, సాగునీరు, విద్య, వైద్యం, మున్సిపల్ పరిపాలన, పోలీస్, ఐటీ, అటవీ రంగాల్లో గత ఎనిమిదేళ్లలో సాధించిన అభివృధ్ధిని ఈ పుస్తకంలో వివరంగా పేర్కొన్నందుకు రచయిత మనోహరాచారిని మంత్రి అభినందించారు.
శరవేగంగా పురోగమిస్తున్న పట్టణ ప్రగతిలో భాగంగా 141 మున్సిపాలిటీలు, పలు పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశాభివృద్ధిలో ఒక వినూత్నమైన, అద్భుతమైన రాష్ట్రంగా బలపడుతోందని పేర్కొన్నారు. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ఐటీ సెక్టార్ ఉందన్నారు. రాష్ట్రం సాధించిన, సాధిస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ పుస్తకంలో పేర్కొనడం అభిననందనీయమైన విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు.
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ పుస్తక రచయిత మనోహరాచారిని ఈ సందర్బంగా అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, దూలం సత్యనారాయణ, శ్రీ హర్ష తదితరులు పాల్గొన్నారు.