Minister KTR | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘మనకేదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడూ వెళ్లే డాక్టర్ వద్దకే వెళ్తాం తప్ప.. కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్లం. అలాగే తెలంగాణ ఇంటిపెద్ద, నాలుగుకోట్ల కుటుంబ పెద్ద కేసీఆర్నే ప్రజలు ఎంచుకుంటారు.. ఓటేసి మళ్లీ గెలిపిస్తారు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ను మించిన మంచి పాలకుడెవరున్నారని, ఏబుల్ లీడర్.. స్టేబుల్ గవర్నమెంట్ను ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణ అనే కుటుంబంలో సణుగుడు, అలుగుడు ఉన్నా ఆఖరుకు ఓట్లు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ పలు సమకాలిన అంశాలపై ముచ్చటించారు. ఉద్యమాన్ని నిర్మించింది.. రాష్ర్టాన్ని తెచ్చింది కేసీఆరేనన్న విశ్వాసంతో ప్రజలు రెండుసార్లు అధికారిన్నిచ్చిన విషయాన్ని మరిచిపోరాదని అన్నారు. ఈసారి కూడా అదే పునరావృతమవుతుందని చెప్పారు. 50 ఏండ్లు పాలించి కరెంట్, సాగు, తాగునీరు ఇవ్వనోళ్లకు ఓటేస్తే వాళ్లు చేసేదేమీ ఉండదని ప్రజలకు తెలుసునని అన్నారు.
శంకరాచార్యులకు.. పీర్ల పండుగకు ముడిపెట్టలేం..
బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శంకరాచార్యులకు.. పీర్లపండగకు ముడిపెట్టినట్టు.. బీజేపీతో బీఆర్ఎస్ను జతచేయలేరని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్పై తప్పుడు నివేదికలు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు. తాము పార్లమెంట్ వేదికగా యూనిఫాం సివిల్కోడ్ను, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని గుర్తుచేశారు. మోదీని ఫాసిస్ట్ అన్న మొదటి సీఎం కేసీఆరేనని.. సీలేరు జల విద్యుత్తు కేంద్రాన్ని ఏపీకి కేటాయించడాన్ని తప్పుబట్టామని చెప్పారు.
కాంగ్రెస్కు మూడు కమాండ్లు..
కాంగ్రెస్కు ఇది వరకు హైకమాండ్ ఉండేదని, కానిప్పుడు మూడు కమాండ్లున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో హై కమాండ్.. బెంగళూరులో న్యూ కమాండ్.. హైదరాబాద్లో లో కమాండ్లున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ టికెట్ల కోసం నేతలు ఢిల్లీ కన్నా ఎక్కువగా బెంగళూరుకే వెళుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో పాచిపోయిన పాత ముఖాలు తప్ప కొత్తదనమేమిలేదని అన్నారు.
ఏబుల్ లీడర్.. స్టేబుల్ గవర్నమెంట్నే..
రాష్ట్రంలో హంగ్ వార్తలను కేటీఆర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో అలాంటి అవకాశమే లేదన్నారు. ప్రజలకు స్పష్టమైన తీర్పునివ్వడం అలవాటని, ఇప్పుడూ అదే జరుగుతుందని చెప్పారు. తెలంగాణలోనూ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అంతా ఒకే తరహా తీర్పునిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు.
కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేద్దామనే
కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేసేలా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మోదీ, రాహుల్గాంధీ కూడబలుక్కొని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మోదీకి, రాహుల్కు కేసీఆర్ కొరకరాని కొయ్యలా తయారయ్యారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ దాటి మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక రాకుండా ఇక్కడే గొంతునులిమేయాలన్న కుట్రతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
80వేల కోట్ల ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అవినీతి ఎలా?
కాళేశ్వరం ప్రాజెక్ట్ను రూ. 80వేల కోట్లతో నిర్మిస్తే.. లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమని అన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా లిఫ్ట్చేయకుండా నీళ్లు అందించలేమని, దీనికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. కృష్ణాగోదారుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలన్నా.. మన వాటాను మనం వాడుకోవాలన్నా ఎత్తిపోతలకు మించిన మరో ప్రత్యామ్నాయంలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల అంచనా వ్యయం రూ. 40వేల కోట్లు కాగా, దీంట్లో పంపులు, కాల్వలు తప్ప ఒక్క రిజర్వాయర్ కూడా లేదని తెలిపారు. స్టోరేజీ లేకుండా నీళ్లను ఎత్తిపోసేంత గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసిందని ఎద్దేవా చేశారు. అదే తాము 147 టీఎంసీల అదనపు స్టోరేజీ సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించామని చెప్పారు.
70 గంటల పనివిధానం సరికాదు
స్మార్ట్ వర్క్ చేయాలి.. హార్డ్ వర్క్ కాదని కేటీఆర్ తెలిపారు. ‘70 గంటల పనివిధానం సరికాదు. ఇప్పుడు పనంతా స్మార్ట్ వర్క్ అయిపోయింది. సెల్ఫోన్తోనే ఆఫీసు పనికూడా చేస్తున్నారు. అటువంటప్పుడు పనిని ఇన్ని గంటలు అని ఎలా లెక్కిస్తారు? ఎంత పనిచేశామో చూడాలి తప్ప.. ఎన్ని గంటలు పనిచేశామో చూడడం నిరర్థకం’ అని అన్నారు. దక్షిణాది నుంచి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని, అదే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పారు. మహామహులు ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలితతోపాటు అనేకమంది సాధించలేనిది.. కేసీఆర్ సాధించబోతున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఎక్కువ ప్రభావితం చేస్తామని, ఏపీ, కర్ణాటకలోనూ అడుగు పెట్టబోతున్నామని చెప్పారు. జాతీయ పార్టీ అంటే ఎమర్జెన్సీగా 28 రాష్ర్టా ల్లో పోటీ చేయాలని ఏమీ లేదన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళతామన్నారు. బీజేపీ కూడా 2 పార్లమెంట్ స్థానాల నుంచి 302కు ఎదిగిందని చెప్పారు.
అది ఎన్డీఎస్ఏ కాదు.. ఎన్డీయే రిపోర్టు
కాళేశ్వరం పాజెక్ట్పై కాంగ్రెస్, బీజీపీ నేతల వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ‘కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) రిపోర్ట్ కాదది. ఎన్డీఏ రిపోర్ట్. రెండు రోజుల్లోనే అధ్యయనంచేసి, బీజేపీ ఆఫీసులో కూర్చొని వండి వార్చిన వంటకం అది’ అని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సీడబ్ల్యూసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చిందని, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు పరిశీలించి ఇంజినీరింగ్ మార్వెల్ అని ప్రకటించిన తర్వాత ఇలాంటి నివేదికలతో గందరగోళం సృష్టించడం దురదృష్టకరమని అన్నారు. ‘కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ 500 శాతం పెరిగింది. కాళేశ్వరమే లేకపోతే.. 68లక్షల నుంచి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులు పండించే స్థాయికి ఎలా ఎదిగింది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రకాశం, ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోను ఇంజినీరింగ్ లోపాలు తలెత్తాయని, ఇది కూడా అలాంటిదేనని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ వలలో పడొద్దు
ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కని, అలా ప్రశ్నించినప్పుడే సుపరిపాలన సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగని స్వార్థ రాజకీయాల వలలో చిక్కుకోవద్దని, దీనివల్ల వారికే నష్టం జరుగుతుందని సూచించారు. రాష్ట్రంలో యువతను తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశంలోనే అతితక్కువ కాలంలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ కేసును ప్రతిపక్షాలేమోమీ శోధించి కనుక్కోలేదని, ప్రభుత్వమే స్వయంగా గుర్తించిందని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఉన్నది బీజేపీనేనని తేలిందని, చివరికి.. పదో తరగతి ప్రశ్నపత్రాలను కూడా లీకేజీ చేసిన వెధవ బండి సంజయ్ అని మండిపడ్డారు. గ్రూప్-2 పరీక్షను రద్దు చేయాలని బండి సంజయ్, రేవంత్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారని, ఆ తర్వాత ఒక అమ్మాయి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం గ్రూప్-2ను రద్దు చేయడం వల్లేనని మాట మార్చేశారని గుర్తుచేశారు.