Minister KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 150 వార్డు కార్యాలయాలను ఒకేసారి ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను రిజిస్ట్రేషన్ చేసుకుని, వాటి పరిషారానికి కృషి చేసే వ్యవస్థగా వార్డు కార్యాలయాన్ని తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఎన్నో పోరాటాలు చేసి స్వపరిపాలన తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైటెక్స్లో నిర్వహించిన ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వార్డు కార్యాలయాలపై స్వయంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిషారమే ఇతివృత్తంగా పనిచేస్తే ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రశంసలు పొందుతుందని చెప్పారు. పౌరుల భాగస్వామ్యంతో జరిగేదే నగర పరిపాలన అని సీఎం కేసీఆర్ భావిస్తారని వివరించారు.
వార్డు కార్యాలయం నుంచే అన్ని సేవలు
హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ర్టానికే గుండెకాయ లాంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం జనాభా 4 కోట్లకుపైగా ఉండగా, అందులో దాదాపు 1.25 కోట్ల మంది హైదరాబాద్లోనే జీవిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లోని ఒక వార్డులో రాష్ట్రంలోని ఒక మున్సిపాలిటీతో సమానమైన జనాభా ఉన్నదని చెప్పారు. కానీ ఒక మున్సిపాలిటీకి ఉన్నంత సిబ్బందికానీ, ఇతర సదుపాయాలు కానీ ఇక్కడి వార్డుల్లో లేవని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే ప్రజా సమస్యల పరిషారానికి, మరింత ఉన్నతమైన సేవలు అందించేందుకు వివిధ విభాగాలకు చెందిన కనీసం పది మంది అధికారులతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టంచేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డు కార్యాలయానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన 10 మంది అధికారులు పనిచేస్తారని వివరించారు. వార్డు కార్యాలయంలోని సిబ్బంది జీహెచ్ఎంసీకి కండ్లు, చెవులు, ముకు మాదిరిగా పని చేయాలని ఉద్బోధించారు. ఒకవేళ స్థానిక వార్డు కార్యాలయంలో కాకుండా ఇతర వార్డు కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదు చేస్తే, వాటిని కూడా స్వీకరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుందని స్పష్టంచేశారు.
వార్డు అధికారుల విధులు
ప్రతి వార్డులో ఉండే ఇంజినీరింగ్ సిబ్బంది రోడ్లు, డ్రైనేజీల నిర్వహణ, మరమ్మతుల కార్యక్రమాలను నిత్యం పరిశీలించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. టౌన్ప్లానింగ్ సిబ్బంది భవన నిర్మాణం సక్రమంగా జరుగుతున్నదో లేదో చూడటం, ప్రభుత్వ ఆస్థుల పరిరక్షణ, భవన నిర్మాణ నిబంధనల అమలు వంటి కార్యక్రమాలను పర్యవేక్షించాలని చెప్పారు. ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల సమస్య వంటి వాటికి పరిషారం చూపాలని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకుంటున్నామని గుర్తు చేశారు.
పారిశుద్ధ్య సిబ్బందిని సమన్వయం చేసుకునేందుకు వార్డు శానిటరీ జవాన్ను, హరిత కార్యక్రమాల నిర్వహణకు అర్బన్ బయోడైవర్సిటీ సూపర్వైజర్ను నియమిస్తామని వెల్లడించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ కోసం జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ఒక ఆధికారి, వార్డు లైన్మెన్ ఉంటారని చెప్పారు. వార్డు నుంచే పరిపాలన సమర్థవంతంగా ఉండేలా ప్రస్తుతం తీసుకున్న భవనాల స్థానంలోనే కొత్తగా భవనాలను నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా సైతం ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తామని, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిషరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రానున్న కొద్ది నెలలపాటు వార్డు కార్యాలయ వ్యవహారాలను జోనల్ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇంత ప్రగతిని ఎప్పుడూ చూడలేదు: తలసాని
హైదరాబాద్లో పుట్టి పెరిగిన పౌరునిగా, మంత్రిగా జీవితంలో ఇంత ప్రగతిని, మంత్రి కేటీఆర్ లాంటి మునిసిపల్ శాఖ మంత్రిని ఎప్పుడూ చూడలేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సుపరిపాలనతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఒక కమిట్మెంట్తో నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పనిచేసే నాయకులు అరుదుగా కనిపిస్తారని, అలాంటి నాయకుడు మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించాలన్న మంత్రి కేటీఆర్ ఆలోచన నగర పరిపాలన చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
టోక్యో నగరంలా హైదరాబాద్
2014 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నగరం గణనీయమైన మార్పులు సాధించిందని, ప్రజల సహకారం ఉంటే హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచంలో అద్భుతమైన టోక్యో నగరంలా హైదరాబాద్ మారాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ నిలువబోతున్నదని, ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వం నిర్మించిన ప్రతి భవనాన్ని వినియోగంలోకి తీసుకొనిరావాలని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో కలిసి పనిచేయాలని సూచించారు.