హైదరాబాద్: పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని తక్కుగూడలో అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది మంచి రోడ్లు, తారునీరు, పార్కులేనని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల స్కూళ్లలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని మంత్రి సబితా రెడ్డి కోరారని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జల్పల్లిలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. జల్పల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్పారు. త్వరలో జల్పల్లిలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. రూ.29 కోట్లతో జల్పల్లికి మరో రోడ్డు మంజూరు చేశామన్నారు.
తుక్కుకూడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. 108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్ వెజ్ బ్లాకులను నిర్మించనున్నారు. ఇందులో 78 గదులతో కూరగాయల బ్లాక్, 30 గదులతో మాంసాహార బ్లాక్ ఉండనుంది.