హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు వరుసగా జరిగే కార్యక్రమాలు, సభల్లో మంత్రి పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.
ఇందులో ప్రధానంగా 24 గంటల తాగు నీటిసరఫరా పైలట్ ప్రాజెక్టు పనులు, సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డంప్ యార్డుల తొలగింపు, నగరంలోని ఐలాండ్స్ ఆధునీకరణ, రోడ్ల నిర్మాణం, ప్రధాన డ్రైనేజీల నిర్మాణాలు, పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం వంటివి ఉన్నాయి. వీటితో పాటు రూ.410 కోట్లతో మానేరు రివర్ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత కరీంనగర్లోని మార్క్ఫెడ్లో జరగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.