Minister KTR | తెలంగాణలోని తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం వయో వృద్ధులతో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వృద్ధుల సంరక్షణ కేంద్రం చాలా బాగుందని ప్రశంసించారు. సౌలత్లు చాలా బాగున్నాయని పేర్కొన్నారు. మలిసంధ్యలో ఆదరణకు నోచుకోలేక నిలువనీడ కరువవుతున్న వృద్ధులకు చివరి దశలో ఆత్మ గౌరవంతో బతికేందుకు ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని వయోవృద్ధులకు ఉపయోగకరంగా ఉండేలా తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
సంరక్షణ కేంద్రంలోని వృద్ధులను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ వస్తుందా అంటూ అడిగారు. వృద్ధులతో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఆడారు. రూ. 40 లక్షల వ్యయంతో 25 బెడ్ల సామర్థ్యంతో ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఐజీ రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి ఎ రమేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.