హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పరిధిలోని సుల్తాన్పూర్లోని వైద్య పరికరాల పార్కులో ఏడు కంపెనీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో హ్యువెల్ లైఫ్ సైన్సెస్ సంస్థ తొలిసారి స్వదేశీ టెస్టింగ్ కిట్ను తీసుకువచ్చిందని తెలిపారు. ఆ సమయంలో వారిని ఆహ్వానించి.. ప్రభుత్వ సాయం అందించనున్నట్లు హామీ ఇచ్చామన్నారు. అయితే శిశిర్, రచనలు ఇప్పుడు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడం సంతోషకరమన్నారు. భారత్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా నెట్టుకురావడం అంత ఈజీ అంశం కాదన్నారు. చిన్న విషయాలకు కూడా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మెడికల్ డివైసెస్ పార్క్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి కేటీఆర్ కితాబు ఇచ్చారు. ఒకే రోజే ఏడు పరిశ్రమలను ఆవిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. 50 కంపెనీలు ఇక్కడ భూమిని తీసుకున్నాయని, వాటిల్లో ఏడు కంపెనీలు ఇప్పటికే ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. మిగతా వారు కూడా వారిని ఫాలో అవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరబాద్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని, లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఇక ముందు కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, శిశిర్- రచన లాంటి యువ పారిశ్రామికవేత్తలతో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.