ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 27: జీవిత చరమాంకంలో పలుకరింపు, ఆదరణ కోరుకొనే వృద్ధులకు మంత్రి కేటీఆర్ అండగా నిలవాలని నిర్ణయించారు. మలిదశలో ఆహ్లాదకర జీవితాన్ని ప్రసాదించి ఆయుష్షు పెంచేందుకు మానవీయ కోణంలో రాష్ట్రంలోనే తొలిసారి ఎల్లారెడ్డిపేటలోని ఎస్టీ హాస్టల్లో ప్రయోగాత్మకంగా డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించి, అందుబాటులోకి తేనుండగా, అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సెంటర్లో వృద్ధులకు వైద్య పరీక్షలు చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు ఒక కేర్టేకర్ ఉంటారు. అలాగే వృద్ధుల కాలక్షేపానికి పలు వార్తా పత్రికలు అందుబాటులో ఉంటాయి.
ఆడుకునేందుకు టేబుల్ టెన్నిస్, చెస్, వైకుంఠపాళి, క్యారంబోర్డులాంటి ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. కూర్చోని మాట్లాడుకునేందుకు వేదికను నిర్మించారు. ఎక్సర్సైజ్, ఫిజియో థెరఫీ కోసం పరికరాలను అందుబాటులో ఉంచారు. తప్పనిసరిగా భావించినప్పుడు 20 మంది వరకు భోజనం అందించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకునేవారి కోసం 20 బెడ్లతో కూడిన హాస్టల్ను ఏర్పాటు చేశారు.