హైదరాబాద్: హైదరాబాద్ నగరం రోజురోజుకు చాలా విస్తరిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వచ్చే 30 ఏండ్లలో హైదరాబాద్ ఇంకా కిలోమీటర్ల కొద్దీ విస్తరిస్తుందని చెప్పారు. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నామన్నారు. శివారులోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలుగా మారాయని వెల్లడించారు. గతంలో వారానికోసారి మంచినీరు వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.
నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి నుంచి నీటిని తరలిస్తున్నామన్నారు. 2051 సంవత్సరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. శివారు ప్రాంతాలకు తాగునీరందించేలా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని కాలనీలకు రూ.1200 కోట్లతో తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్లో వరదలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుత్బుల్లాపూర్లో ఐదు ఎస్టీపీలు చేర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో రూ.3866 కోట్లతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గాజుల రామారంలో 1100 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కును ప్రారంభించామన్నారు. మళ్లీ ఒకసారి జీవో 58, 59 తీసుకొచ్చి ఇండ్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో సమస్యలపై ఏడున్నర ఏండ్లుగా కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో స్థలం ఇవ్వాలని ఎన్నిసార్ల కోరినా బీజేపీ సర్కార్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంద ఎకరాలు ఇస్తే రూ.5 వేల కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తామన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.138 కోట్ల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాచుపల్లి-ఓఆర్ఆర్ రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పేట్ బషీరాబాద్లో ఎస్టీపీలకు, కూకట్పల్లిలో నాలా విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సురభివాణీ దేవి పాల్గొన్నారు.