రాజన్న సిరిసిల్ల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న విరాట్కోహ్లీ సెంచరీ కొట్టినట్టు.. ఎన్నికల్లో కేసీఆర్ వంద సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అని ధీమా వ్యక్తంచేశారు. నవంబర్ 30న జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యేనని చెప్పారు. రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ తెలంగాణను ఆగంచేసి ఓట్లు తమ ఖాతాలో వేసుకొనేందుకు తండ్లాడుతున్నారని విమర్శించారు. సెంటిమెంట్.. ఆయింట్మెంట్లకు లొంగిపోతే మన బతుకులు ఆగమైపోతాయని హెచ్చరించారు.
సోమవారం కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ పట్టణం, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరై, యువకులను ఉద్దేశించి ప్రసంగించారు. రాహుల్గాంధీ, నరేంద్రమోదీ అహంకారాన్ని పీచమణిచే విధంగా తిరుగులేని సమాధానం చెప్పే సత్తా మన తెలంగాణ బిడ్డలకు ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులకు టికెట్ కావాలన్నా, బీ ఫాం కావాలన్నా, మంత్రులు కావాలన్నా ఢిల్లీకి పోవాల్సిందేనని.. బీజేపీ నేతల పరిస్థితి కూడా అంతేనని, అక్కడి నుంచి అమిత్షా, యోగీ, బోగీలు రావాలని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఎన్నికల్లో పోటీ చేయలేక తప్పించుకొని పారిపోయాడని అన్నారు.
కాంగ్రెస్ సినిమా అట్టర్ఫ్లాప్
‘కాంగ్రెసోడి సినిమాకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, గుజరాత్ యాక్టర్.. సినిమా అట్టర్ ఫ్లాప్.. మనది బ్లాక్బస్టర్.. వాళ్లది డిజాస్టర్’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘రేపు తెలంగాణను ఎవరు నడపాలనేది డిసైడ్ చేయాల్సింది రాహుల్, మోదీ కాదు.. తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. మళ్లా ఢిల్లీకి మన జుట్టు ఇస్తే 6 నెలలకు ఒక సీఎం దిగుతడు. ఏదో మాట్లాడి ఆగంజేస్తరు’ అని హెచ్చరించారు. వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనను తన కార్యకర్తలే భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, సెస్ చైర్మన్ రామారావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.
కేటీఆర్ అదిరిపోయే స్టెప్పులు
‘గిరగిర ఔర్ ఏక్ధక్కా.. గింగిర గిర కేసీఆర్ పక్కా.. దేఖ్లేంగే’ అంటూ మంత్రి కేటీఆర్ హుషారుగా స్టెప్పులేశారు. ఎల్లారెడ్డిపేట యువ ఆత్మీయ సమ్మేళనంలో ఆహూతుల ప్రసంగాలు పూర్తయిన అనంతరం, బిగ్స్క్రీన్పై దేఖ్లేంగే పాట వేశారు. యువ నాయకులు రిథమ్కు తగ్గట్టుగా పాటపై డ్యాన్స్ చేస్తుండగానే, కేటీఆర్ వారిలో మరింత ఉత్సాహం నింపేందుకు వచ్చి స్టెప్పులేశారు. గులాబీ కండువాను పైకెత్తి ఊపుతూ అక్కడున్నవారిలో జోష్ నింపారు. సభా ప్రాంగణమంతా ఈలలు, కేరింతలతో మార్మోగింది.