కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/నర్సాపూర్: కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంటు కోతలు, ఎరువుల గోసలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే ప్రజలు ఆ పార్టీకి 11 చాన్సులిస్తే ఏమీ చేయలేదని, ఆ పార్టీ నేతలు ఇప్పుడొచ్చి ఒక్క చాన్స్ అని అడుగుతున్నారని మండిపడ్డారు. ఆదివారం చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట సహా నర్సాపూర్లో నిర్వహించిన రోడ్షోల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రోడ్షోల్లో కేటీఆర్కు ప్రజలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎవుసమే తెలియని రేవంత్రెడ్డి.. రైతులకు 3 గంటల కరెంట్ చాలని అంటున్నడు. 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని చెప్తున్నడు. ఇలాంటివాళ్లకు ఓటేస్తే మళ్లీ పాత రోజులే వస్తయ్. కర్ణాటకలో అక్కడి రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. నాడు కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు ఇవ్వనోడు ఇప్పుడు ఇస్తానంటే నమ్మేదెట్ల? డౌటే లేదు. వచ్చేది మన ప్రభుత్వమే. మూడోసారి కేసీఆర్ సీఎం అవటం పక్కా’ అని స్పష్టం చేశారు. కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి రెండు చోట్లా ఓడిపోవటం ఖాయమని తేల్చిచెప్పారు.
రైతులు, కౌలురైతుల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కౌలుదారుకిస్తే, పంట యజమానికి ఇవ్వాలంటూ రేవంత్ చెప్పటంపై మండిపడ్డారు. 3 గంటల కరెంట్ చాలని రేవంత్, తెలంగాణలో కరెంటే లేదని కోమటిరెడ్డి, రైతుబంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతున్నారని, దీన్ని రైతులు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, సాగు, తాగు నీళ్లు ఇచ్చామని వివరించారు. మూడోసారి గెలిచాక ‘కేసీఆర్ భరోసా’ అమలు చేస్తామని, జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని వెల్లడించారు. కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదని, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు.
‘నేను నిధులన్నీ సిరిసిల్లకే పెడుతున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. ఇక్కడి కాంగ్రెసోళ్లు మాత్రం ఏమీ అభివృద్ధి జరగలేదంటున్నరు. కాంగ్రెసోళ్లకే క్లారిటీ లేదు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్లను జిల్లా చేసి కళాశాలలు, వర్సిటీలు ఏర్పాటు చేశానని చెప్పారు. ప్రతి మండలంలో కార్పొరేట్కు దీటుగా పాఠశాలల భవనాలు నిర్మించి నాణ్యమైన విద్యనందిస్తామని తెలిపారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ, గల్ఫ్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయం అందిస్తామని వెల్లడించారు. గోదావరి నీళ్లు తెచ్చి నియోజకవర్గ ప్రజల కాళ్లు కడుగుతానని చెప్పారు. భారీ మెజార్టీతో తనను గెలిపిస్తారన్న నమ్మకం తనకు ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.