Minister KTR | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. హైదరాబాద్లో ఆ సంస్థకు ఇప్పటికే ఉన్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ)కు సంబంధించిన మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరించాలని నిర్ణయించింది. అమెరికా వెలుపల ఈ సంస్థకు అతిపెద్ద ఆర్అండ్డీ కేంద్రం ఇదే. ఈ పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆర్ అండ్ డీని వృద్ధి చేసుకొనే వ్యూహంలో భాగమని కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తున్న బయోటెక్నాలజీ కంపెనీ ఆక్యూజెన్ కూడా హైదరాబాద్లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఆర్ అండ్ డీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మెడ్ట్రానిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సర్జికల్ విభాగం ప్రెసిడెంట్ మైక్ మారినారో, ఆర్ అండ్ డీ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సర్జికల్ విభాగం ప్రెసిడెంట్ మైక్ మారినారో, ఆర్ అండ్ డీ ఎంటర్ప్రైజ్ వైస్ ప్రెసిడెంట్ మణి ప్రకాశ్, వైస్ ప్రెసిడెంట్ దివ్యప్రకాశ్ జోషి తదితరులు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు.
2020లో ఈ కంపెనీ 163 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,321కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్లో ఎంఈఐసీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 800కుపైగా ఇంజినీర్లు పనిచేస్తుండగా, తాజా పెట్టుబడితో దశలవారీగా ఐదేండ్లలో ఉద్యోగుల సంఖ్య 1,500 దాటుతుందని కంపెనీ తెలిపింది. విస్తరణ ద్వారా భారతదేశంలోని ఇంజినీరింగ్, మొబైల్ యాప్లు, అప్లికేషన్, డెస్క్టాప్ సాఫ్ట్వేర్, క్లౌడ్/వెబ్ యాప్లు, డాటా ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రాడక్ట్ సెక్యూరిటీ, సైబర్-ప్రాడక్ట్ సెక్యూరిటీతో కూడిన విభిన్న నైపుణ్యంగల ప్రతిభను పొందడమే లక్ష్యమని పేర్కొన్నది. రోబోటిక్స్, ఇమేజింగ్, నావిగేషన్, సర్జికల్ టెక్నాలజీ, ఇంప్లాంటబుల్ టెక్నాలజీస్ వంటి కీలకమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల అభివృద్ధికి ఈ పెట్టుబడి దోహదం చేస్తుందని తెలిపింది.
మెడ్ట్రానిక్ విస్తరణ ప్రణాళిక పట్ల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తరపున తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచంతోనే తమకు పోటీ అని పేర్కొన్నారు. జీవశాస్ర్తాల రంగంలో తెలంగాణ ఇప్పటికే అగ్రభాగాన ఉన్నదని, వైద్య పరికరాల పరిశ్రమను అత్యంత ప్రాధాన్యతా రంగంగా గుర్తించిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని వెల్లడించారు. ప్రపంచ మెడ్-టెక్ రంగంలో హైదరాబాద్కు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఈ పెట్టబడి నిదర్శనమని చెప్పారు.
మెడ్ట్రానిక్ ప్రధాన కార్యాలయం ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉన్నది. 150 కన్నా ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. 90 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కార్డియాక్ పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఇన్సులిన్, సర్జికల్ టూల్స్, పేషెంట్ మానిటరింగ్ సిస్టం వంటి విభాగాల్లో 70 రకాల వైద్య పరికరాలను ఈ కంపెనీ ఆవిష్కరించింది.
హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రీజనరేటివ్ జెనెటిక్ చికిత్సలకు అవసరమైన మందులను తయారు చేయటంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని ఆక్యూజెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాధిపతి అ రుణ్ ఉపాధ్యాయ తెలిపారు. నగరంలోని సైంటిఫిక్, మెడికల్ కమ్యూనిటీలతో పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆర్అండ్డీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని కం పెనీ ఇండియా అధిపతి అజయ్ పొట్లూరి అన్నారు.
అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం న్యూయార్క్లో ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం, యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రకాల వ్యాపారాలు స్థాపించేందుకు అనువైనదని తెలిపారు. భారత్లో పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన, అనువైన ప్రాంతంగా తెలంగాణ ఇప్పటికే నిరూపించుకొన్నదని పేర్కొన్నారు.
ప్రగతిశీల, పరిశ్రమ-స్నేహపూర్వక విధానాలు, బలమైన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ తెలంగాణ సొంతమని అన్నారు. తెలంగాణ 14 ప్రాధాన్య రంగాలను గుర్తించిందని, వీటిలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. పెట్టుబడుల కోసం భారతదేశాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకునేవారికి తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన గేట్వేగా నిలుస్తున్నదని చెప్పారు. న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాపార సంభాషణల్లో అంతర్భాగాలుగా మారాయని పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు.
బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) ఈవీపీ చీఫ్ డిజిటల్, టెక్నాలజీ అధికారి గ్రెగ్ మేయర్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంఎస్ సంస్థ హైదరాబాద్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు ప్రణాళికను ప్రకటించింది. తాజా భేటీ సందర్భంగా వారు తమ కేంద్రం ఏర్పాటు పురోగతి వివరాలు, వృద్ధి ప్రణాళికలపై మంత్రితో చర్చించారు.
వింగ్సూర్-ఇన్సర్టెక్ కంపెనీ వ్యవస్థాపకులు అవి బసు న్యూయార్క్లో మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత ఆర్థిక సేవల్లో తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై చర్చించారు. వింగ్సూర్ ప్రపంచవ్యాప్తంగా చిన్న రైతులు, గ్రామీణ వర్గాల కోసం బీమా ఉత్పత్తులతోపాటు వాతావరణం, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి స్థిరత్వం తదితర అంశాల్లో సహకారం అందిస్తున్నది.
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అరోన్ క్యాపిటల్ చైర్మన్ డేవిడ్ వోల్ఫ్ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో సమావేశమైం ది. అరోన్ క్యాపిటల్, తెలంగాణ ప్రభుత్వం మధ్య సహకారానికి గల అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పటిష్ఠమైన పర్యావరణ వ్యవస్థ ఉన్నదని కేటీఆర్ తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యంగల శ్రామికశక్తి, ఉద్యోగులకు ఇక్కడ కొదవలేదని వివరించారు.
అరోన్ క్యాపిటల్ సంస్థ కంపెనీల విలీనం, సమీకరణలు, మూలధనం, ఫైనాన్సింగ్, సలహాలు తదితర సేవలను అందిస్తున్నది. ఈ సంస్థకు మీడియా, ఆరోగ్య సంరక్షణ, జీవశాస్ర్తాలు, వినియోగదారుల వస్తువులు, సేవలు, ఆహారం-పానియాలు, పరిశ్రమలు, సాంకేతికత, స్థిరాస్థి తదితర రంగాల నుంచి క్లయింట్లు ఉన్నారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్, తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్, ముఖ్య పౌర సంబంధాల అధికారి అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పని చేస్తున్న బయోటెక్నాలజీ కంపెనీ ఆక్యూజెన్ హైదరాబాద్లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీన్ థెరపీ, రీజనరేటివ్ సెల్ థెరపీ వ్యాక్సిన్ల తయారీకి సహకారం అందించడం వంటి కార్యకలాపాలను ఈ కేంద్రం నుంచి నిర్వహించనున్నది. మంత్రి కేటీఆర్తో ఆక్యూజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి, సీఈవో అరుణ్ ఉపాధ్యాయ తదితరులు గురువారం సమావేశమయ్యారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఆర్అండ్డీ కేంద్రంతో తమ కంపెనీ గ్లోబల్ సంస్థగా ఆవిర్భవిస్తుందని, భారత్లో విస్తరించేందుకు ఇదో అద్భుత అవకాశమని శంకర్ ముసునూరి తెలిపారు. ఆక్యూజెన్ కంపెనీని ఆహ్వానిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సెల్, జీన్ థెరపీ టెక్నాలజీతో కార్యకలాపాలను నిర్వహించనున్న ఆక్యూజెన్ సంస్థ ఆర్అండ్డీ సెంటర్ ద్వారా హైదరాబాద్లోని లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 2030 నాటికి తెలంగాణ బయోటెక్ ఎకో సిస్టం 250 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపారు.
భారతదేశం నూతన ఆవిష్కరణకు గ్లోబల్ హబ్గా పేరుగాంచిందని మెడ్ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైక్ మరినారో కొనియాడారు. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు భారత్ వృద్ధిచెందుతున్న మార్కెట్గా తాము విశ్వసిస్తున్న ట్టు చెప్పారు. మెడ్ట్రానిక్కు హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా నిరూపితమైందని, ప్రభుత్వ సహకారానికి గర్విస్తున్నట్టు తెలిపారు. ఎంఈఐసీ వైస్ ప్రెసిడెంట్ దివ్య ప్రకాశ్ జోషీ మాట్లాడుతూ.. హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు, పురోగతికి ఆర్అండ్డీలో తాజా పెట్టుబడి పునాది వంటిదని చెప్పారు. హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రధాన కేంద్రంగా, బలమైన ఎకో సిస్టం ఉన్న ప్రాంతంగా నిలిచిందని ప్రశంసించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ కాన్సులేట్ కార్యాలయంలో వరుస సమావేశాల్లో బిజీబిజీగా గడిపిన మంత్రి కేటీఆర్.. మధ్యలో అక్కడ ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద నిలబడి ఫొటో దిగారు. అనంతరం ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే లెజెండ్ వ్యక్తి, లెజెండ్ మహాత్మాగాంధీజీ అంటూ తెలిపారు.