హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ను కట్టెబట్టిన మాదిరిగానే.. మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి తప్పుకుంటామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి నిన్న చేసిన మాటలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మీలో ఉత్సాహాన్ని, ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గెలుస్తామన్న విశ్వాసం కలిగింది. ఉద్యమాల్లో రాటు దేలిన నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఉద్యమంలో బాగా పని చేసింది విద్యార్థి నాయకులు. ఎన్నికల గురించి, పోరాటాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అవగాహన పెంచుకోవాలి. ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒక్క కారణంతోనే వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బలుపు కారణంగానే వచ్చింది. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆయనను లోబర్చుకుని, అవసరమైతే రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే, మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోదీ అహకారం ప్రదర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికనే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్పష్టం చేశారు.
నిన్న మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ధనవంతుడైతే ఆ నియోజకవర్గం బాగుపడదు. రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్లు కట్టబెట్టినట్లే.. నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. మా మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉంటాం. మాకు నియోజకవర్గం అభివృద్ధి కావాలి. ఒక్క సీటో, రెండో సీట్లతోనూ ఫరక్ పడేది లేదు. 105 సీట్లతో సభలో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.