కరీంనగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి సోమవారం హైదరాబాద్ లో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని, రాబోయే మూడు నెలలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ప్రతిపక్షాలు కనీస పోటీనిచ్చే పరిస్థితిలో లేవని, వాటి డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదలవుతుందని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్ రమణ, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, వొడితెల సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్కుమార్, కోరుకంటి చందర్ పాల్గొన్నారు.