Minister KTR | హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జూన్ 7,8 న దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్షోకి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రికి ఆహ్వానం పంపించారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించిందని.. ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు కేటీఆర్కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు హెల్త్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, రవాణా తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను సమావేశంలో ప్రదర్శిస్తారు. మంత్రి కేటీఆర్ హాజరవ్వడం దుబాయ్లోని ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.