హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గందె శ్రీధర్ తెలిపారు. ఈనెల 15వ తేదీన జురిక్ నగరంలో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ కేటీఆర్ పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రవాస భారతీయ ప్రతినిధులు కిషోర్ తాటికొండ, అనిల్ జాల, కృష్ణా రెడ్డి అల్లు తెలిపారు.
2018 సంవత్సరంలో మొదటిసారి ఐటీ మినిస్టర్ హోదాలో కేటీఆర్.. దావోస్ పర్యటనకు వచ్చినట్లు వారు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సమ్మిట్లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచే విధంగా కేటీఆర్ పర్యటన దోహదపడిందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రతి ఏటా పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది. ఈ ఏడాది దావోస్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్లో కూడా తెలంగాణ జైత్రయాత్ర కొనసాగాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఇతర బృంద సభ్యులకు ప్రవాసులు శుభాకాంక్షలు తెలిపారు.