హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతోంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్గా తిరిగొస్తుంది. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ
లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్రమోడీ.. అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్కచేయకుండా, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారని ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ల నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని కేంద్రం పీడించుంకు తింటుందని ఆరోపించారు. ‘నేనిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణం’ అని స్పష్టం చేశారు. ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్ధాలేనన్నారు.
అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులని కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకోసారి.. రష్యా ఉక్రేయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారని విమర్శించారు. కానీ ఇదంతా నిజం కాదని.. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారన్నారు. అంతెందుకు పకనున్న దాయాది దేశాలతోపాటు, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికీ అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉందన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదని, ఇందుకు కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యమన్నారు. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కానీ, కరోనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజలు తగ్గిన ధరల ప్రయోజం పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని రూ.20 పెంచిందని ఆరోపించారు. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొందలేకపోయారన్నారు. 2014లో సుమారు రూ.70.51 ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ.. ఈ రోజుకి పెట్రోల్ రూ.118.19, డీజిల్ను రూ.104.62కు పెంచిందన్నారు.
అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో క్రూడాయిల్ ధర ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందన్నారు. రేటు రెట్టింపయ్యిందని. ఇది ఎలా అయ్యింది? ఎందుకు అయ్యింది? అని ప్రశ్నించారు. ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమన్నారు. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే అనీ, అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో మోదీ ప్రభుత్వం లూటీ చేసిందని ధ్వజమెత్తారు.