Meher Ramesh | టాలీవుడ్లో స్టైలిష్ మేకింగ్తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం వ్యక్తిగత కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదం చుట్టుముట్టింది. మెహర్ రమేష్ సోదరి మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. ఈ విషాద వార్తను స్వయంగా మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. గత 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో చికిత్స పొందుతున్న ఆమె, విజయవాడలో సోమవారం రాత్రి 9:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.
తన పోస్ట్లో మెహర్ రమేష్ తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నప్పటి నుంచి ఆమె తనకు అండగా నిలిచిందని, తల్లి ప్రేమతో చూసుకుందని పేర్కొన్నారు. తన కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించిందని, ఇటీవల కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఎంతో ఆనందించామని గుర్తు చేసుకున్నారు.నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయిన నా చిన్నక్క ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఆ దేవుడి సన్నిధికి ఆమె వెళ్లిపోయిందనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ మెహర్ రమేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని కోరుకుంటున్నారు.