Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిన విద్యుత్ కోతల కారణంగా వరి నాట్లు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఫిర్యాదు చేద్దామని చూసినా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండటం లేదని.. ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.