హైదరాబాద్ : ఎన్నికలు ఏవైనా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతాయని, మునుగోడుది ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఓ న్యూస్ చానెల్ భేటీలో పాల్గొన్నారు. సందర్భంగా మునుగోడు ఎన్నికలు, బీఆర్ఎస్తో పాటు వివిధ అంశాలపై స్పందించారు. మునుగోడులో ఎమ్మెల్యే అమ్ముడుపోతే వచ్చిందని, ఇదే విషయాన్ని టీవీ టిబేట్లో రాజగోపాల్రెడ్డి ఒప్పుకున్నారన్నారు. చిన్న కంపెనీని అని చెప్పుకున్న రాజగోపాల్రెడ్డికి రూ.18వేలకోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని, దాని వెనుక ఉన్న బీజేపీ పెద్దలు ఎవరు? దాని వెనుక ఉన్న గుజరాత్ గద్దలు ఎవరు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదని, ఓ కాంట్రాక్ట్ తెల్లబట్టలు వేసుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టినంత మాత్రాన ఆయన ప్రవృత్తి, తత్వం మారదని విమర్శించారు.
రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత శాసనసభలో గానీ బయటగానీ మునుగోడు నియోజకవర్గం గురించి, ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపనపోలేదు. అనాథ మారిదిగా నియోజకవర్గాన్ని వదిలేసి.. గెలిచిన తెల్లవారి నుంచే అటు బీజేపీతో, టీఆర్ఎస్తోనే బేరసారాలు జరిపారన్నారు. సోదరుల తత్వాన్ని తెలిసిన ఇద్దరినీ విశ్వసించరని, ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీ పాటపాడుతారన్నారు. చాలాసార్లు పార్టీలో చేరుతానని చెప్పినా.. రాజకీయంగా వారిని నమ్మడం కష్టమని చెప్పి పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత బీజేపీని గొప్పగా మాట్లాడడం మొదలు పెట్టారని, ఇంకో వైపు మోదీ తెలంగాణలో ఇళ్లిల్లు తిరిగినా బీజేపీ గెలువదని చెప్పారన్నారు. ఎన్నో వైరుధ్యాల మధ్య కాంగ్రెస్లో ఇమడలేక.. అనుకున్న పదవి రాక.. ఎటోవైపు పోవాలని చెప్పి ఆలోచించి చివరకు ఆర్థిక ప్రయోజనాల కోసం బేరం కుదిరిన తర్వాత సోదరుడితో కలిసి బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కోల్ ఇండియాలో భారీ కాంట్రాక్టు వచ్చిందని ఆరోపించారు.
బీజేపీ పెద్దల ఆశీర్వాదం లేకుండా అంతపెద్ద కాంటాక్ట్ రాజగోపాల్కు ఇచ్చారని, అదానీని కూడా కాదని రాజగోపాల్కు ఇచ్చారన్నారు. బెదిరించి పార్టీలో చేర్చుకోవడం బీజేపీ నైజమన్నారు. ఈడీ కేసులు పెట్టి, దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా వాడుకొని, ప్రలోభ పెట్టి తాము ఎవరినీ పార్టీలోకి చేర్చుకోలేదన్నారు. కేవలం ఇవాళ రాజగోపాల్రెడ్డి, ఆయన కంపెనీకి జరిగిన లాభం వల్లనే ఆయన బీజేపీలో చేరానని, ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని లోకం కోడై కూస్తుందన్నారు. దీన్నే టీవీ చానల్లో ధ్రువీకరించారన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయం, మూడ్ను బట్టి, ఆలోచన సరళిని బట్టి మార్చుకుంటే బలపడుతాయన్నారు. పార్టీ బలపడిన తర్వాత ఉనికి కోసం, ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తారన్నారు. 2014లో టీఆర్ఎస్ 66 స్థానాల్లో గెలిచాం.. 2018 ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచామన్నారు. అన్ని పార్టీలు చేరే వారి బలాన్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి చేర్చుకుంటాయని, కానీ బీజేపీ స్టైల్ డిఫరెంట్ అన్నారు. బీజేపీ స్టయిల్ ఏంటంటే నయయో.. భయానో బెదిరిస్తారన్నారు. మొదట కేసులు పెడుతారని, ఆ పార్టీలో చేరగానే మాయమవుతాయన్నారు. పక్కన రాష్ట్రంలోని ఏపీలో సీఎం రమేశ్, సుచనా చౌదరిపై తెలుగుదేశంలో ఉన్న సమయంలో కేసులు పెట్టారన్నారు. బీజేపీలోకి వెళ్లగానే కేసులు మాయమయ్యాయని గుర్తు చేశారు.
బీజేపీ దేశంలో ఎనిమిది, తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్పష్టంగా ప్రజలు కోరుకున్నవిధంగా కొన్ని పనులు పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత దేశంలో ఉన్న పరిస్థితులు, దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణను 75 సంవత్సరాల్లో ఎవరూ చేయలేని విధంగా ఇంటింటికీ మంచినీరు అందించగలినప్పుడు, రైతులకు 24గంటల ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసినప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని, 2018లో అన్ని గ్రామాలకు కరెంటు ఇచ్చామని మోదీ ప్రకటించారని.. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపిన అనంతరం ఆమె గ్రామానికి కరెంటు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. పచ్చి అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మి చేయడం బీజేపీకి అలవాటన్నారు.
చిన్న రాష్ట్రమై తెలంగాణ చేయగలిగినప్పుడు.. దేశంలో ఎందుకు జరుగడం లేదని కేసీఆర్.. టీఆర్ఎస్ను అవసరమైతే భారత రాష్ట్రసమితిగా జాతీయ పార్టీగా పెట్టాలని చర్చలు, సంప్రదింపులు జరిపారన్నారు. ఈ విషయం ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలకు తెలుసునని, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్కు తెలంగాణలోనే చెక్ పెట్టాలని చెప్పి.. మోదీ, అమిత్షా బీజేపీ మునుగోడు ఎన్నికను తీసుకువచ్చారన్నారు. బీఆర్ఎస్ను విస్తరించకుండా కుట్రలు పన్నారని ఆరోపించారు. మునుగోడుకు కోట్ల రూపాయలు పంపుతున్నారని, మునుగోడులో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది సున్నా అని స్పష్టం చేశారు. ఐదు నెలల్లో గుజరాత్కు లక్ష కోట్లు ఇచ్చారని, తెలంగాణకు ఏమీ ఇచ్చారో చెప్పగలరా? ప్రశ్నించారు. వరదలు వస్తే ఒక్క పైసా ఇవ్వలేదని, రాష్ట్రంలో ఫ్లోరోసిస్ లేకుండా చేశామన్నారు.
చర్లగూడెం భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని, మా ఫ్యామిలీలో చాలా మంది భూనిర్వాసితులు ఉన్నారన్నారు. నిర్వాసితుల సమస్యలు మాకు తెలుసని, రాజగోపాల్రెడ్డి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారన్నారు. రోడ్డు రోలర్ గుర్తును బీజేపీ మళ్లీ పెట్టించిందని, అధికారులను బీజేపీ నేతలు ఆడిస్తున్నారన్నారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమని, ఎందుకు మారారన్నది చూడాలన్నారు. మంచి భవిష్యత్ కోసం మా పార్టీలోకి వస్తారని, బెదిరింపులకు భయపడి బీజేపీలోకి వెళ్తారని, మోదీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 105 నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ.. కేవలం మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి చేస్తే అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని.. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచినా.. ములుగును జిల్లా కేంద్రం చేశామని, రాష్ట్రంలో హెల్త్ ఫ్రొఫైల్ కార్యక్రమం తీసుకుంటే.. ములుగును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు.