KTR | కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎవరూ చేయని విధంగా రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశానికి ఉపయోగపడేలా ఒక్కపనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఆ సొమ్మును దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం మంత్రులు, ప్రతినిధులతో కలిసి మంత్రి స్విట్జర్లాండ్ లోని దావోస్కు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం, లాభాలు ఆర్జించే రీతిలో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు చేయడంలో తప్పులేదు. పెట్టుబడులతో ప్రతిపైసా లాభంతో తిరిగొస్తుంది. అయితే, తెచ్చిన అప్పులను ఏం చేశామన్నదే ముఖ్యం. గతంలో 14 మంది ప్రధానులు చేసిన అప్పులు రూ.56లక్షల కోట్లయితే, ప్రధానిగా మోడీ ఒక్కరే చేసిన అప్పులు రూ.100 లక్షల కోట్లు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశానికి ఉపయోగపడేలా ఒక్కపనైనా చేశారా..? ఆ సొమ్ముతో ఏ అభివృద్ధి పనులు చేశారు..?’ అని మంత్రి ప్రశ్నించారు.
తెలంగాణ చేసే ప్రతీ పైసా అప్పుకు ప్రతిఫలం ఉంది అని మంత్రి అన్నారు. తెలంగాణ అప్పులను ప్రశ్నించే అర్హత బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడుందని నిలదీశారు. తెలంగాణ అప్పులపై బీజేపీ కావాలనే నానా యాగీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పులు చేసి తీసుకొచ్చిన సొమ్మును తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులపై, రాష్ట్ర అభివృద్ధిపై ఖర్చు చేసింది. దీని ప్రతిఫలాలు ఇప్పటికే అందుకుంటున్నాం. ముందుముందు మరిన్ని లాభాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిస్తుంది’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.