జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామి అయినందుకు మాకెంతో గర్వంగా ఉన్నది. తెలంగాణ బిడ్డల చెమట, రక్తం అసమర్థ బీజేపీ రాష్ర్టాలకు ఉపయోగపడుతున్నది. తెలంగాణకు వచ్చి దండం పెట్టిపో.. తెలంగాణ కాళ్లు కడిగి నెత్తిల పోసుకొన్నా రుణం తీరదు. తెలంగాణ పైసలు బీజేపీ అసమర్థ పాలిత రాష్ర్టాల్లో ఉపయోగపడటం లేదా? తెలంగాణ వల్ల యూపీ, గుజరాత్, బీహార్ వంటి రాష్ర్టాలు అభివృద్ధి చెందుతున్నాయని ఒప్పుకుంటే సంతోషిస్తాం.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): దమ్ముంటే లోక్సభను రద్దుచేసి ఎన్నికలకు రావాలని.. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకొందామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సవాల్ విసిరారు. ప్రధాని మోదీ అసమర్థుడని, ఆ పదవికి అనర్హుడని పేర్కొన్నారు. మోదీ దద్దమ్మ విధానాలే దేశం అప్పులపాలు కావడానికి కారణమని నిప్పులు చెరిగారు. నిజాలు చెప్పాలని అడిగితే నిజాం గురించి మాట్లాడారని ఎద్దేవాచేశారు. దేశాన్ని ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే.. మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్న విషయం ప్రపంచమంతటికీ తెలుసన్నారు. ఆదివారం తెలంగాణభవన్లో పలువురు మంత్రులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కొంతకాలంగా రాజకీయ పర్యాటకుల సందడి సాగుతున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్కో పర్యాటకుడు రాగానే ‘ఆజ్ కా క్యా థీమ్ హై..? క్యా బోల్నా హై?’ అని క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా స్థానిక నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని చురకలు వేశారు. సీజనల్గా అప్పుడప్పుడు వచ్చి పోయే వారికి స్థానిక స్థితిగతులు తెలియవని అన్నారు. ఎయిర్పోర్టులోనో.. వారి కార్యాలయంలోనో బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయకత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. అందులో సత్యం ఉన్నదా లేదా? అసత్యమా? అర్ధసత్యమా? పట్టించుకోకుండా గాలిమోటర్లో వచ్చి గాలి మాటలు చెప్పి రయ్మంటూ వెళ్లిపోతున్నారని దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. పార్లమెంట్ను రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం బీజేపీకి ఉంటే.. రేపే ఎన్నికలకు తామూ సిద్ధమేనని సవాల్ విసిరారు. రహస్యాలు, చీకటి దోస్తానాలు, తొత్తులుగా పనిచేసుడులో రేవంత్రెడ్డి పీహెచ్డీ చేశారని విమర్శించారు. తమ పోటీ వేరే రాష్ట్రంతో కాదని, తమ పోటీ ప్రపంచంతోనని చెప్పారు.
తుక్కుగూడలో చెప్పిన అబద్ధాలకు అమిత్షా ఆయన పేరును అబద్ధాల బాద్షాగా పేరు మార్చుకోవాలని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి తెలంగాణకు పనికివచ్చే ఒక్కటంటే ఒక్క మంచిమాట చెప్పలేదని అన్నారు. షా మాట్లాడిన మాటలన్నీ తుక్కు.. తుప్పు.. తప్పుడు మాటలేనని తేల్చేశారు. షా మాటలను తెలంగాణ సమాజం విశ్వసించదని స్పష్టంచేశారు. 2014, 2018లో రెండుసార్లు తెలంగాణ ప్రజల చేతుల్లో బీజేపీ ఘోర పరాభవానికి గురైందని, 119 స్థానాల్లో పోటీ చేస్తే 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేకున్నా.. తమకు ప్రత్యర్థి కాకున్నా.. షా అబద్ధాలను వాట్సాప్ వర్సిటీలో తిరిగే అవాస్తవాలను ప్రజలు వాస్తవాలని నమ్మే పరిస్థితి ఉండకూడదన్న లక్ష్యంతో ప్రజలకు నిజాలు చెప్తున్నామని తెలిపారు.
దీన్ని బట్టి చూస్తే.. ఎవరిది అవినీతో అర్థమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం పదవిని హర్రాజ్ పాట పెట్టి అమ్మినోడు.. ఇక్కడికి వచ్చి వింటున్నవాళ్లు ఏమనుకొంటారో అన్న సోయి లేకుండా షో చేస్తే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. చెతన్యవంతమైన తెలంగాణ ప్రజలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరని చెప్పారు. దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో దేశ ప్రజలు కోరుకొనేది షోమెన్షిప్ కాదని.. స్టేట్స్మెన్షిప్ అని అన్నారు. నలుగురు ఈలలు కొట్టంగనే.. స్థాయిని మరిచి మాట్లాడటం తగదని తెలిపారు. ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తాను 27 ప్రశ్నలను సంధిస్తే.. ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేదని ఎద్దేవా చేశారు. నిజాలు చెప్పాలని కోరితే.. నిజాం గురించి షా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ వాళ్లు నిజాంను తలుచుకొన్నంతగా నిజాం వారసులు సైతం తలుచుకోరేమోనని వ్యంగ్యంగా అన్నారు.
కేంద్రం నుంచి పన్నుల రూపంలో రాష్ట్రంనుంచి వెళ్లిన మొత్తానికి.. రాష్ర్టానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై బీజేపీ నేతలు తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వీళ్లది అబద్ధపు బతుకా? అర్ధసత్యాల బతుకా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు చెల్లించిందని, అదే కేంద్రం నుంచి రాష్ర్టానికి తిరిగి వచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి మెహర్బానీగా వచ్చిందేమీ లేదని.. రాజ్యాంగబద్ధంగా మిగతా రాష్ర్టాల మాదిరిగానే వచ్చిందని స్పష్టంచేశారు. ఇవ్వటం-పుచ్చుకోవటం గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరు ఎవరికిస్తున్నారని నిలదీశారు. మిషన్ భగీరథకు నిధులు ఇచ్చామని అమిత్ షా పేర్కొనటాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ రూ.19 వేల కోట్లివ్వాలని సిఫారసు చేస్తే 19 పైసలైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామి అయినందుకు తమకెంతో గర్వంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డల చెమట, రక్తం అసమర్థ బీజేపీ రాష్ర్టాలకు ఉపయోగపడుతున్నదని చెప్పారు. ‘తెలంగాణకు వచ్చి దండం పెట్టిపో.. తెలంగాణ కాళ్లు కడిగి నెత్తిల పోసుకొన్నా రుణం తీరదు’ అని పేర్కొన్నారు. తెలంగాణ పైసలు బీజేపీ అసమర్థ పాలిత రాష్ర్టాల్లో ఉపయోగపడటం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వల్ల యూపీ, గుజరాత్, బీహార్ వంటి రాష్ర్టాలు అభివృద్ధి చెందుతున్నాయని ఒప్పుకొంటే సంతోషిస్తామన్నారు. గుజరాత్లో పటేల్ స్టేడియాన్ని మోదీ స్టేడియంగా పేరు మార్చారని, చివరికి ఆ స్టేడియంలో కూడా తెలంగాణ పైసలు ఉన్నాయని చెప్పారు. దేశంలో వేరే దగ్గర తెలంగాణ పైసలు పెట్టడంలో అభ్యంతరమేమీ లేదని, కానీ తెలంగాణకు వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని, జాతి నిర్మాణంలో మన పాత్రను కొనియాడాలని హితవు చెప్పారు. అంతేకానీ ధోకేబాజ్ మాటలు చెప్తే తెలంగాణ ఊరుకోదని స్పష్టంచేశారు.
హమ్ దో.. హమారే దో అన్నట్టు మోదీ సర్కార్ సాగుతున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశాన్ని ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే, మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారనే విషయం దేశప్రజలందరికీ తెలుసన్నారు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే నిబంధన ఎవరి కోసం పెడతారో? విమానాశ్రయాలు ఎవరి కోసం అమ్ముతారో? పవన్హన్స్ను అమ్మి ఎవరి చేతుల్లో ఎట్లా పెడతారో అందరికీ తెలుసని చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని వేటకుక్కల్లాగా అడ్డం పెట్టుకొని ఆడిస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రత్యర్థులపై వేటకుక్కలను ఉసిగొలుపుతూ మీ ఆటలు సాగుతాయని అనుకోవద్దు. ఎప్పటికీ మీ ఆటలు సాగవు అమిత్షా’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. బీజేపీకి సొంత నినాదం.. సొంత విధానం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఉద్యమ చరిత్రే లేదని, అందుకే సర్దార్ వల్లభాయి పటేల్ను ఎత్తుకుపోయారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సోయే లేదని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనడం కూడా అమిత్ షాకు సరిగా రావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు అవుతుంటే, నీళ్ల పంచాయితీని కేంద్రం ఎందుకు తేల్చడం లేదని నిలదీశారు. కృష్ణా బేసిన్లో పాదయాత్ర చేసిన బండి సంజయ్కి ఆ విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కృష్ణానదిలోని 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 575 టీఎంసీలు ఇవ్వాలంటే కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు. అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే నోరు మెదపరని విమర్శించారు. నీళ్ల విషయంలో తెలంగాణ ఏ స్థాయిలో విజయం సాధించిందో చిన్న పిల్లాడు కూడా చెప్తాడని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమని, ప్రతి గ్రామంలో చెరువును బాగుచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. పాలమూరులో 8 లక్షల ఎకరాల ఆయకట్టును అదనంగా తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రేక్షక పాత్రకే పరిమితమైందని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం నాన్చుడు ధోరణి వల్లే పాలమూరు- రంగారెడ్డి పథకం పూర్తికాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోదీ నల్ల చట్టాలతో రైతులు ఢిల్లీలో 13 నెలలు ఆందోళనలు చేయాల్సి రావడం దేశచరిత్రలోనే దుర్మార్గమని మంత్రి కేటీఆర్ అన్నారు. 700మంది రైతులు చనిపోతే ‘నా కోసం చచ్చిపోయినరా?’ అని మోదీ చులకనగా మాట్లాడారన్నారు. ‘సామాన్యులకు కన్నీళ్లు తెప్పిచ్చినోడు, రైతులను ఏడాదిపాటు ఎండలో, వానలో, చలిలో నిలబెట్టినోడు, నడిరోడ్డుపై మేకులు కొట్టినోడు.. మోదీ. ఆయన కాదా నియంత? నిజాం అంటూ అమిత్షా మాట్లాడారు.. ఇలాంటి దౌర్భాగ్యపు పనులు తెలంగాణ సర్కారు ఏ రోజైనా చేసిందా?’ అని నిలదీశారు.
ఓటేస్తేనే బియ్యం కొంటమని అమిత్షా చెప్పడం భారత ఆహార భద్రత చట్టం ప్రకారం నేరమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశం అమిత్షా అబ్బసొత్తు, అయ్య సొత్తు కాదని.. గల్లాపట్టి.. నిలదీసి.. సుప్రీంకోర్టుకు వెళ్లి కేంద్రం మెడలు వంచి కొనిపించే సత్తా తెలంగాణ సర్కారుకు ఉన్నదని చెప్పారు. తెలంగాణ రైతులకు నాట్లేసుడే కాదు.. ఓట్లతో మేట్లు వేసుడు కూడా వచ్చని హెచ్చరించారు.
ఒవైసీ భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ఇంకెంతకాలం కాలుస్తరని కేటీఆర్ ప్రశ్నించారు. మజ్లిస్, ఒవైసీ ప్రస్తావన లేకుండా మాట్లాడటం బీజేపీకి చేతకాదన్నారు. మజ్లిస్కు భయపడి ఆర్టికల్ 370కి మద్దతివ్వ లేదని అమిత్షా అన్నారని.. పార్లమెంట్లో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు 370 ఆర్టికల్ రద్దుకు మద్దతు ఇచ్చిన విషయం కూడా ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ షాకు గుర్తులేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ మరో శ్రీలంక అవుతుందనడాన్ని ప్రస్తావిస్తూ.. ‘శ్రీలంక ఒక దేశం. ఎవడన్నా రాష్ర్టాన్ని, దేశాన్ని పోలుస్తడా?’ అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, ఎగుమతులు, దిగుమతులు అన్నీ కేంద్రం చేతిలోనే ఉంటాయన్న సంగతీ మర్చిపోయారన్నారు. అంతర్యుద్ధం, మెజార్టీ, మైనార్టీ పంచాయితీల వల్లే శ్రీలంకలో ఆ దుస్థితి వచ్చిందని, ప్రస్తుతం మన దేశం కూడా అదే దారిలో పయనిస్తున్నదని అందరూ అంటున్నారని గుర్తుచేశారు. మోదీ, షా ఏం చేసినా.. బీజేపీ ఇంజిన్ను షెడ్డుకు పంపుడైతే ఖాయమని కేటీఆర్ స్పష్టంచేశారు.
బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తమని చెప్తున్నారని.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నదే బీజేపీ సర్కారు అని.. ఇప్పుడే దేశమంతా ఉచిత విద్య, వైద్యం ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్, కర్ణాటక, బీహార్లో ముస్లింలకు ప్రత్యేక కోటా ఇస్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం ఇవ్వొద్దనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉర్దూలో యూపీఎస్సీ పరీక్ష పెడుతున్నప్పుడు, తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఉర్దూలో నిర్వహించడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. ఉర్దూ ప్రమోషన్ కోసం ప్రధాని ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టారని గుర్తుచేశారు. మీడియా సమావేశంలో కేటీఆర్తోపాటు మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, కే వాసుదేవరెడ్డి, రావుల శ్రీధర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు లింగంపల్లి కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అప్పుల పాలైందని అమిత్ షా పేర్కొనటాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం అప్పుల నిష్పత్తి తీస్తే దేశంలోని 28 రాష్ర్టాల్లో కింది నుంచి ఐదోస్థానంలో పైనుంచి 23వ స్థానంలో తెలంగాణ ఉన్నదని గుర్తుచేశారు. రాష్ట్ర అప్పుల శాతం 23.5% అని తెలిపారు. ‘మణిపూర్, యూపీ, బీహార్, గోవా, హర్యానా, ఉత్తరాఖండ్, సిక్కిం.. ఇలా ప్రతిచోటా అప్పులు చేసుకొంటూ.. ఆ తప్పులను మాపై రుద్దుతారా?’ అని ప్రశ్నించారు. తాము చేసిన అప్పులతో మిషన్ భగీరథ, కాళేశ్వరంతో సాగు, తాగునీటి సమస్యను, విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి రైతుల వెతలు తీర్చామని తెలిపారు. మోదీ వల్లనే దేశం దివాలా తీస్తున్నదని, ఆయన ప్రధాని పదవికి అనర్హుడని పేర్కొన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిననాడు దేశం అప్పు రూ.56.69 లక్షల కోట్లు ఉంటే.. ఈ ఎనిమిదేండ్లలో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు.
మోదీ తన కార్పొరేట్ మిత్రులకు ధారపోసేందుకు దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, నిరుద్యోగ శాతం దేశాన్ని పీడిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచంలో అత్యధిక గ్యాస్ ధర ఉన్నది మనదేశంలోనేనని, ప్రపంచ ఆకలి సూచీల్లో 103వ స్థానంలో మనమున్నామని గుర్తు చేశారు. మోదీ పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందన్నారు. పెట్రోల్… డీజిల్.. గ్యాస్ మీద సెస్సు రూపంలో రూ.26.5 లక్షల కోట్లు వసూలు చేసి, బడాబాబుల అప్పులు రూ.11.65 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని అన్నారు. దేశానికి నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే ఇట్ల్లనే ఉంటుందని విమర్శించారు. తెలంగాణలో తమ స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉన్నదని, మోదీ స్టీరింగే కార్పొరేట్ల చేతుల్లోకి పోయిందని ఎద్దేవా చేశారు.
ఉద్యోగ కల్పనలో తెలంగాణది స్టార్టప్ విధానమైతే .. కేంద్రానిది ప్యాకప్ విధానమని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ అడిగితే.. ఏండ్లకు ఏండ్లు తొక్కిపెట్టారని దుయ్యబట్టారు. నాలుగేండ్ల క్రితమే అనుమతిచ్చి ఉంటే గ్రూప్-1, 2 తదితర ఉద్యోగాల భర్తీ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకొంటూనే, మరోవైపు ప్రైవేట్ రంగానికి రెడ్కార్పెట్ వేయటం వల్ల లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో 1 లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇప్పుడు మళ్లీ సుమారు 81 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వివరించారు. పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం మంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కూడా కలిపితే మరో 7.5 లక్షల ఖాళీలు ఉన్నాయని, మొత్తం సుమారు 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ పెట్టుకుని.. నియామకాల గురించి మాట్లాడటానికి అమిత్ షాకు సిగ్గుందా అని ప్రశ్నించారు.
ఇటీవలే రైల్వేశాఖలో 72 వేల ఉద్యోగాలు తీసేశారని తెలిపారు. రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మానని చెబుతున్న మోదీ.. చివరికి దేశాన్నే అమ్మే పనిలో పడ్డాడని ఎద్దేవా చేశారు. ఎల్ఐసీని అమ్మేస్తున్నామని బాహాటంగా చెప్పిన మోదీ సర్కారు.. నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, సింగరేణిని కూడా అమ్ముతామని అంటున్నారని చెప్పారు. దీనివల్ల కంపెనీల్లోని ఎస్సీ, ఎస్టీ పిల్లల ఉద్యోగాలు పోతాయని, రిజర్వేషన్లు ఉండవని బీజేపీనే చెప్తున్నదని పేర్కొన్నారు. రూ.1.95 లక్షల కోట్ల అప్పు ఉన్న వొడాఫోన్లో 35 శాతం వాటాని మోదీ ప్రభుత్వం కొనుగోలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది కార్పొరేట్ దోస్తుల కోసం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎనిమిదేండ్లలో ఒకే ఒక్కసారి రూ.50 పైసలు విద్యుత్తు చార్జీలు పెంచామని కేటీఆర్ తెలిపారు. గుజరాత్లో 5 నెలల్లో నాలుగుసార్లు విద్యుత్తు చార్జీలు పెంచారని, ఇటీవలే రెండున్నర రూపాయలు పెంచారని గుర్తుచేశారు. సామాన్యులకు సచ్చేదిన్.. మోదీ మిత్రులకు అచ్చేదిన్ అన్నట్టు బీజేపీ పాలన సాగుతున్నదని చురకలేశారు. సామాన్యుడి దగ్గర 25.5 లక్షల కోట్లు దోచి, మిత్రులకు 11.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు.
తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మంచిదేనన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వరని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారని, మరి పీఎం కిసాన్ యోజన ద్వారా కౌలు రైతులకు ఇస్తున్నరా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మిషన్ కాకతీయను కాపీ కొట్టి ఆజాదీకా అమృత్ సరోవర్ పెట్టారని తెలిపారు. మోదీ రాజ్యంలో ఆజాదీ లేదని, అమృతం లేదని, సరోవరం ఎక్కడుందో తెలియడం లేదన్నారు.
ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్.. అంటే అధికారం ఇవ్వడానికి, అదేమన్న తంబాకా, లవంగమా? అని బండి సంజయ్ని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఊళ్లలో ఉన్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం దగ్గర నుంచి అన్నింట్లో మా వాటా ఉన్నదని సంజయ్ చెప్తున్నారని, అంటే అభివృద్ధి జరిగిందని ఒప్పుకొన్నట్టే కదా అని ప్రశ్నించారు. అధికారం అనేది ప్లీజ్ అని వేడుకుంటే ఇవ్వరని, మంచిచేసే వాళ్లకే ఇస్తారని తెలిపారు.
మూడుసార్లు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఏమీ చేయలేదని.. ఇవాళ ఆ రాష్ట్రంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో పడిగాపులు పడుతున్న దృశ్యాలే చెప్తున్నాయంటూ ఆ ఫొటోలను కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. నవసారి అనే ఊళ్లో నీటికి కటకట ఉన్నదని, గుంతల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. గుజరాత్లో బీజేపీ ఎమ్మెల్యేనే తాగునీటి కోసం ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉన్నదని చెప్పారు. గుజరాత్లో వారంలో ఒకరోజు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారన్నారు. పవర్ కోసం… మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యేనే ఆందోళనకు దిగారని గుర్తుచేశారు. గోవా, కర్ణాటక, హర్యానాలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో ఈ పరిస్థితిని ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. మరి.. ఎవరిది అసమర్థ ప్రభుత్వమని కేటీఆర్ ప్రశ్నించారు.
హమ్ దో.. హమారే దో అన్నట్టు మోదీ సర్కార్ సాగుతున్నది.దేశాన్ని ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే, మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారనే విషయం దేశప్రజలందరికీ తెలుసు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే నిబంధన ఎవరి కోసం పెడతారో? విమానాశ్రయాలు ఎవరి కోసం అమ్ముతారో? పవన్హన్స్ను అమ్మి ఎవరి చేతుల్లో ఎట్లా పెడతారో అందరికీ తెలుసు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని వేటకుక్కల్లాగా అడ్డం పెట్టుకొని ఆడిస్తున్నా రు. ప్రత్యర్థులపై వేటకుక్కలను ఉసిగొలుపుతూ మీ ఆటలు సాగుతాయని అనుకోవద్దు. ఎప్పటికీ మీ ఆటలు సాగవు అమిత్షా..
-మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్