KTR | హైదరాబాద్ : దొరల తెంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా.. అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిజంగా ఈ రోజు జరుగుతున్న పోరాటం.. నవంబర్ 30న ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పంచాయితీ ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
1952లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే ఈ ఢిల్లీ దొర రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ. 1952లో సిటీ కాలేజీ వేదికగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినదించిన ఐదు మంది పిల్లలను కాల్చి చంపింది ఈ ఢిల్లీ దొర రాహుల్ ముత్తాత. 1956లో ఇష్టం లేని పెళ్లి చేసింది కూడా ఢిల్లీ దొర నెహ్రూనే. 1968లో విద్యార్థులు, విద్యావంతులు, న్యాయవాదులు, మేధావులు కలిసి ఖమ్మం జిల్లాలో ఉద్యమం ప్రారంభిస్తే ఆ సందర్భంగా 370 మంది పిల్లలను పిట్టల్లా కాల్చి చంపించింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ నాయినమ్మ ఇందిరమ్మ. 1971లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి, ఆత్మను ఆవిష్కరించి.. 11 ఎంపీలు సీట్లు మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితికి అప్పగిస్తే.. వాళ్లందరిని గొర్రెల మాదిరిగా గుంజుకుపోయి కాంగ్రెస్లో కలుపుకొని, ప్రజల తీర్పును అపహాస్యం చేసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ నాయినమ్మ ఇందిర. 2004 ఎన్నికల సందర్భంలో తియ్యటి మాటలు చెప్పి, తెలంగాణ ఇస్తామని నమ్మబలికి, పదేండ్లు చావగొట్టి, వందల మంది ప్రాణాలు తీసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ తల్లి సోనియా గాంధీ. ఇవన్నీ వాస్తవాలు.. నేను చెప్పట్లేదు అని కేటీఆర్ తెలిపారు.
2014 దాకా ఢిల్లీ దొరలతో కొట్లాడినం తెలంగాణ కోసం. 2014 తర్వాత మరొక దొర.. నరేంద్ర మోదీతో కొట్లాడుతున్నాం. తెలంగాణను అవమానించేలా మాట్లాడుతున్నారు. హైకోర్టు విభజనకు ఐదేండ్ల సమయం తీసుకున్నారు. అది మాత్రమే కాదు.. తెలంగాణ మెడ మీద కత్తి పెట్టి లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా.. ఈ దొరతోని కూడా కొట్లాడుతున్నాం. చావనైనా చస్తాం కానీ.. ఈ ఢిల్లీ దొరల ముందు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ తల దించదు. ఎందుకంటే మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ సాధించిన బిడ్డలుగా రోషం, పౌరుషం ఉంది. ఈ సన్నాసుల ముందు ఎన్నటికీ తల దించం అని కేటీఆర్ స్పష్టం చేశారు.