హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోదీ భోజనం చేసిన దృశ్యాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. వీటితో పాటు కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలు కాలినడకన వెళ్తున్న దృశ్యాలను కేటీఆర్ షేర్ చేశారు. ఈ రెండు ఘటనలను పోల్చుతూ మోదీ వైఖరిని కేటీఆర్ తప్పుబట్టారు.
ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం చేస్తారు. ఎన్నికలు లేకపోతే వలస కూలీలను గాలికొదిలేసి, ప్రత్యక్ష నరకం చూపించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కూలీలపై మోదీ చూపించిన ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. లక్షల మంది వలస కార్మికులు కరోనా లాక్డౌన్లో వందల కిలోమీటర్లు నడిచినప్పుడే ఈ ప్రేమ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన కేంద్రం బలవంతంగా ఛార్జీలను వసూలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.