KTR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారు.. మీరు అక్కడ ఉంటారో లేదో చూసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పల్లె, పట్టణ ప్రగతి పథకాలపై శాసనసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు నల్లాల ద్వారా అందుతుందని కేంద్ర మంత్రినే పార్లమెంట్లో ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయి. గత 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో పెట్టిన ఖర్చు రూ. 6 వేల కోట్లు మాత్రమే. కాంగ్రెస్ హయాంలో మానేరు ఒడ్డున ఉన్నవారికి కూడా మంచినీరు అందేది కాదు. కాంగ్రెస్ 60 ఏండ్లలో చేయని పనులను 6 ఏండ్లలోనే చేసి చూపించాం. రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశాం. నీళ్ల కోసం ఆనాడు నీళ్ల మంత్రి జానారెడ్డి దగ్గరకు వెళ్తే.. కన్నీళ్లు పెట్టించారు. నల్లగొండలో ఫ్లోరెడ్ రక్కసిని రూపుమాపాం అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ డబ్బా ఇండ్లు కట్టించి ఇచ్చింది.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఒక్క డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానం. గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పరిపాలనలో మున్సిపాలిటీలకు డబ్బులు రాకపోయేది అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 2014 -23 మధ్య ఒక లక్షా 21 వేల 294 కోట్లు ఖర్చు చేశాం. 2004 – 14 వరకు చూస్తే ఖర్చు చేసింది రూ. 26,211 కోట్లు. అంటే 462 శాతం ఎక్కువ ఖర్చు చేశాం. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆన్ ఏనాడో చెప్పారు. రాష్ట్రాల సమహారమే కేంద్రం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.