KTR | రాజన్న సిరిసిల్ల : ఎవడో వచ్చి నాలుగు స్పీచ్లు కొట్టంగానే, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వగానే ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావొద్దు.. ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగు పడుతుందో ఆలోచించాలి అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. 57 ఏండ్లలో గుడిని, బడిని పట్టించుకోలేదు.. సాగునీటి గోస తీర్చలేదు కానీ.. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎల్లారెడ్డిపేటలో రూ. 8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మనం ఖర్చు చేసే ప్రతి పైసాను సమగ్రంగా ఆలోచించి ఖర్చు పెట్టాలి అని కేటీఆర్ సూచించారు. ప్రజలకు అవసరమైన వాటిని తప్పకుండా చేయాలి. మా కంటే ముందున్న ప్రభుత్వాలు ఏం చేశాయి..? ఒక బడిని బాగు చేద్దామన్న ఆలోచన లేదు.. కానీ ఇప్పుడొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బడిని, గుడిని పట్టించుకోలేదు. కరెంట్, సాగు నీళ్లు ఇవ్వలేదు. ఎవడో చెప్పిండని కాదు.. మన ప్రణాళిక ప్రకారం పని చేయాలి. అయిన పనుల గురించి మాట్లాడటం లేదు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్కు అర పైసానైనా సాయం చేసిండా..? ఒక్క నవోదయ పాఠశాలనైనా వచ్చిందా..? కస్తూర్బా కాలేజీ వచ్చిందా..? మెడికల్ కాలేజీ రాదు.. నర్సింగ్ కాలేజీ ఇవ్వరు. మళ్లీ సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజీ ఇవ్వాలని మాట్లాడుతారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
బరాబర్ ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ వస్తది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ నువ్వేవడో ఆందోళన చేసినందుకు కాదు. ఎల్లారెడ్డిపేట ప్రజల మీద ప్రేమతోని కేసీఆర్ డిగ్రీ కాలేజీ ఇస్తారు. కార్లకు అడ్డపడటం, ధర్నాలు చేయడం కాదు.. చేతనైతే, దమ్ముంటే.. కేంద్రం నుంచి ఓ రెండు కాలేజీలు, ఓ రెండు పరిశ్రమలు తీసుకురావాలి. సిరిసిల్ల నేతన్నల కోసం ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ తీసుకురావాలి. కరీంనగర్లో ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురా..? అలా విద్యలో పోటీ పడాలని బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
పలకతో వచ్చి పట్టాతో వెళ్లాలనే ఉద్దేశంతో గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటు చేశాం అని కేటీఆర్ గుర్తు చేశారు. 3 దశల్లో 510 ప్రభుత్వ పాఠశాలల్లో 12 మౌలిక సదుపాయాల, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల పరిధిలో – 60 పాఠశాలల్లో 22 వేల మంది విద్యార్థులకు కంప్యూటర్ చాంప్స్ పేరుతో బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నాం అని తెలిపారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను టీ ఫైబర్తో అనుసంధానం చేయనున్నామని చెప్పారు.
సిరిసిల్ల ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోనే ముందుంది అని కేటీఆర్ తెలిపారు. దేశంలో విద్య విషయంలో బెస్ట్ స్కూల్ ఎక్కడా ఉన్నాయంటే సిరిసిల్ల అనే పేరు రావాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మానవ సంబంధాలు, జీవ కారుణ్యoపై అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మండలాలు, ప్రజా ప్రతినిధులు పోటీ పడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాను విద్యా ప్రమాణాలలో దేశంలోనే ఆదర్శంగా నిలపాలని కేటీఆర్ సూచించారు.