KTR | పెద్దపల్లి : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి.. రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. సింగరేణి అంటే తెలంగాణ భాగ్యరేఖ.. తెలంగాణ జీవనాడి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్గి గుండం అవుతుందని కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. రామగుండ కార్పొరేషన్ పరిధిలో రూ. 300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సింగరేణి పట్ల కేంద్రానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ కంపెనీనికి నామినేషన్ మీద ఇవ్వమని అడిగాం అని కేటీఆర్ గుర్తు చేశారు. దాని మీద ఎలాంటి స్పందన లేదు. అదే గుజరాత్లో అయితే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే నాలుగు బొగ్గు గనులు రాసిచ్చిండు మోదీ. మన దగ్గరికి వచ్చేసరికి వేలం పాటలో పాల్గొనండి అని చెబుతుండు. గాలి మోటారులో వచ్చి సింగరేణిని అమ్మబోమని అని మోదీ గాలి మాటలు చెప్పిండని గుర్తు చేశారు. తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టావు. ఇది వాస్తవం కాదా..? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సింగరేణిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉంటే.. వెంటనే ఆ నాలుగు బొగ్గు గనులను సింగరేణికి కేటాయిచాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రయివేటీకరణ మీద పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రధాన మంత్రికి కూడా ఈ వేదిక ద్వారా చెబుతున్నాను. నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మితే.. అక్కడ కొందరు మాట్లాడొచ్చు.. మాట్లాడకపోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణతో కానీ, కేసీఆర్తో కానీ పెట్టుకుంటే మాత్రం విడిచిపెట్టం.. ఎక్కడి దాకనైనా వేటాడుతాం అని హెచ్చరిస్తున్నాను. పొరపాటున సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం, ఈ బొగ్గు గని మొత్తం అగ్గిగుండం అవుతుంది అని హెచ్చరించారు. సింగరేణి మనుగడ సాధించాలంటే మన గోడు వినేటోడు ఒకడు ఢిల్లీలో ఉండాలి. ఈ బొగ్గు గనులను కాపాడుకోవాలంటే ఒక్క బీజేపీ అభ్యర్థికి కూడా ఓటేయొద్దు. డిపాజిట్లు గల్లంతు చేసి గుండు కొట్టించి అవతలికి పంపించాలి అని రామగుండం ప్రజలను, సింగరేణి కార్మికులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు వచ్చిందట.. కేసీఆర్ది కుటుంబ పాలన అని ఆమె కూడా అంటారని కేటీఆర్ పేర్కొన్నారు. ఏ టు జడ్ అంతా అవినీతే. ఆకాశంలో స్పెక్ట్రమ్ విడిచిపెట్టలేదు. పాతాళంలో బొగ్గును విడిచిపెట్టలేదు. అలాంటి వారొచ్చి ఇవాళ మనకు అవినీతి గురించి లెక్చర్లు చెబుతారు. ఇక మనం సిగ్గుపడాలి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా..? మహారాష్ట్ర రైతులు తెలంగాణలో మమ్మల్ని కలుపుకోండని అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణ దేశంలోనే అగ్రభాగానా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని కోరేది ఒక్కటే. కేసీఆర్ మీ బిడ్డ.. పార్టీ పేరు మారింది.. కానీ పార్టీ డీఎన్ఏ మారలేదు. మంచిగా పని చేసే నాయకులు, ప్రభుత్వాలు కోరుకునేది ఒక్కటే. మంచి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీది. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలి అని కేటీఆర్ అన్నారు.
రామగుండానికి మెడికల్ కాలేజీ వచ్చింది. ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులను కూడా తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు. జులై, ఆగస్టు నెలలో తప్పకుండా వచ్చి ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులకు శంకుస్థాపన చేస్తాం. సింగరేనిలో పని చేసిన, పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సింగరేణిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలను కేసీఆర్ నిలబెట్టుకున్నారు. బొగ్గు ఉత్పత్తిలో కానీ, విద్యుత్ ఉత్పత్తిలో కానీ దేశంలోనే సింగరేణి అగ్రశేణి కంపెనీగా వెలుగుతుంది. సింగరేణి కార్మికులు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఉద్యమ సమయంలో నిప్పు రవ్వలై కేసీఆర్ వెంట నిలబడ్డారు. వలస పాలకులకు వ్యతిరేకంగా సింగరేణి సమ్మె చేస్తే ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికుల పోరాటలను మరిచిపోలేదు. కేసీఆర్ కార్మిక పక్షపాతి అని గుర్తు చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.