రంగారెడ్డి : విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోదీ విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి అనాజ్పూర్ వరకు రహదారి విస్తరణ పనులకు, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు, ప్రభుత్వాసుపత్రిలో భవన నిర్మాణానికి, మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు.
దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు అని కేటీఆర్ ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీవి పనికిమాలిన మాటలు.. ఇలా మాట్లాడిన ప్రధాని మరొకరు లేరు అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు ప్రధాని చేసింది శూన్యమని మండిపడ్డారు. రైతులకు ఇష్టం లేకపోయినా నల్ల చట్టాలు తెచ్చి రద్దు చేశారు. కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. విశ్వాసం నింపాల్సిన చోట మోదీ విద్వేషం నింపారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. దేశంలో మోదీ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారు. ఆసరా పెన్షన్లు రానివారికి ఏప్రిల్ నుంచి అందజేస్తామని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణ బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.