నారాయణపేట : ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. పాలమూరు ఎంపీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతవు అని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు – రంగారెడ్డి పథకానికి మోకాలడ్డు పెట్టినందుకా? కృష్ణా జలాల్లో నీటి వాటాలు తేల్చనందుకు ఓటు వేయాలా..? మా పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ఓటు వేయాల్నా? అని కేటీఆర్ నిలదీశారు.
ఇక మోదీ దేవుడు అని ఒకాయన అంటుంటుండు. ఆయన ఎవరికి దేవుడు అని కేటీఆర్ ప్రశ్నించారు. సిలిండర్ రేటు పెంచి కట్టెల పొయ్యి దిక్కు చేసినందుకు ఆడబిడ్డలకు మోదీ దేవుడా? పెట్రోల్ రేట్ పెంచినందుకు మోదీ దేవుడా..? ధరల పెరుగుదలకు కారణం ఎవరు.. మోదీ కాదా..? అని కేటీఆర్ మండిపడ్డారు.
రైతులపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారు విబేక్ దేబ్రాయ్ నిన్న ఒక పత్రికలో వ్యాసం రాశారు. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయింది. డబుల్ ఇంజిన్ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయింది. ఇక రైతులపై ఆదాయపు పన్ను వేయాలని ఆయన రాసుకొచ్చారు. ఇంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని రాసిన వ్యక్తి అల్లాటప్పా వ్యక్తి కాదు. ప్రధానికి పెద్దదిక్కుగా ఉన్న ఆర్థిక సలహాదారే రాసిండు అని కేటీఆర్ వివరించారు. ఆదాయమే లేదని ఏడుస్తుంటే.. రైతు మీద ఆదాయపు పన్ను వేస్తడంట. దయచేసి రైతన్నలు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.