హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్లు అయితే.. మోదీ ఈ ఎనిమిదేండ్లలో రూ. వంద లక్షల కోట్లు అప్పు చేసిండని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రూ. 25 వేల కోట్లు మిషన్ భగీరథకు ఇచ్చామని అమిత్ షా చెప్పారు. రూ. 19 వేల కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది. కానీ రూ. 19 కూడా కేంద్రం ఇవ్వలేదు. అమిత్ షా నిన్న సిగ్గు లేకుండా మాట్లాడిండు. తెలంగాణ అప్పుల పాలై పోయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. 28 రాష్ట్రాల్లో అప్పుల నిష్పత్తిలో తెలంగాణ స్థానం 23వ స్థానం. అధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ముందు వరుసులో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ అప్పు చేసినా పరిమితంగానే, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పు చేసిందని కేటీఆర్ స్పష్టం చేశారు. 2014 నాటికి ఈ దేశం యొక్క అప్పు రూ. 56 లక్షల 69 వేల 428 కోట్లు.. కాగా ఇప్పుడు వచ్చే సంవత్సరం మార్చితో చూసుకుంటే ఒక వంద లక్షల కోట్లు అప్పు చేసిండు మోదీ. 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్లు అయితే.. మోదీ ఈ ఎనిమిదేండ్లలో రూ. వంద లక్షల కోట్లు అప్పు చేసిండు. ఈ దేశాన్ని అప్పుల పాలు ఎవరు చేస్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసినా కూడా మంచి పనులకు వినియోగించామన్నారు. మిషన్ భగీరథ కట్టినం. కరెంట్ బాగు చేశాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల బాధలు తీర్చాం. మరి మీరు ఎవరి కోసం అప్పులు చేశారని ప్రశ్నిస్తున్నామన్నారు కేటీఆర్. పెట్రోల్ డిజీల్ పై ఇప్పటి వరకు రూ. 26 లక్షల కోట్లు వసూలు చేశారు. బడా బాబులకు సంబంధించిన రూ. 11 లక్షల 68 వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తరు. ఇది మీ బతుకు. ఒక అసమర్థ ప్రధాని వల్ల ఇది జరిగింది. కార్పొరేట్ శక్తుల అప్పులు మాఫీ చేసి, పేదల తోలు వలుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
మా స్టీరింగ్ మా చేతుల్లోనే బ్రహ్మాండంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ స్టీరింగే కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది. మీ స్టీరింగ్ ఎవరు నడుపుతున్నారో ప్రజలందరికీ తెలుసు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను చేతిలో పెట్టుకుని, ఏజెన్సీలను అడ్డం పెట్టుకుని ఆటలు సాగిస్తున్నారు. కానీ మీ ఆటలు సాగవు. ఇది ప్రజాస్వామ్యం.. అబద్ధాలు చెప్పి ఎక్కువ కాలం బతకలేరని కేటీఆర్ నిప్పులు చెరిగారు.