హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్ షా అప్పనంగా కట్టబెట్టిన కాంట్రాక్టులపై రాజగోపాల్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారు.. దానిపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీకు బీజేపీ అప్పనంగా రాసిచ్చిన మాట వాస్తవం కాకపోతే.. కాంట్రాక్ట్ను వదులుకో. న్యాయ వ్యవస్థ మీద మాకు కొంత నమ్మకం ఉంది. దమ్ముంటే ఆ పని చేయ్. నేను ఆ పని చేయను. వేల కోట్లు ఎలా వదులుకోవాలి అనుకుంటావా..? భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద బండి సంజయ్ నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం చేయ్. కాంట్రాక్ట్తో సంబంధం లేదని ఈ గుండు సాక్షిగా చెబుతున్నానని చెప్పు. లేదా మేం కట్టిన యాదాద్రికి వచ్చి మోదీ మీద ప్రమాణం చేయ్ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఈ బఫూన్ గాళ్లతో కొట్లాడటం పెద్ద కష్టమేం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలతోనే కొట్లాడినొళ్లం.. వీళ్లతోని ఎంత? అని అన్నారు. మునుగోడు యుద్ధంలో డబ్బులతో నాయకులను కొంటున్నారు. మనం నమ్ముకోవాల్సింది కేవలం ప్రజలను మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు.