నల్లగొండ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆయనకు రైతులు, ఎడ్లు, వడ్లు తెల్వదు.. విందులు, చిందులు మాత్రమే తెలుసని కేసీఆర్ మండిపడ్డారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ నిప్పులు చెరిగారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దాయనకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు. ఏడు సార్లు అవకాశం ఇచ్చినా ఏం ఉద్ధరించలేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు అవకాశం ఇచ్చారు.. 50 ఏండ్లు వారే పరిపాలించారు. 50 ఏండ్లు ఏం చేయలేనోడు.. ఇంకొక్క చాన్స్ ఇవ్వండని అడుగుతుండు. రైతు సంఘర్షణ సభ కాదు.. అది కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు తన్నుకుంటున్నారు. ప్రజలను, రైతులను అయోమయానికి గురి చేసే దిక్కుమాలిన కథ అని కోపోద్రిక్తులయ్యారు.
ఫ్లోరోసిస్ ను ఎందుకు అరికట్టలేదు. రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వలేదు. నెల్లికల్ లిఫ్ట్ను ఎందుకు పూర్తి చేయలేదు. ఈ ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రాదు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. నాగార్జున సాగర్ అభివృద్ధిలో ముందుకు పోతోంది. డిగ్రీ కాలేజీ ఇస్తానని చెప్పారు. అది కూడా ఇచ్చారు.. ఆ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు అన్ని పనులు అభివృద్ధి పథంలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు మళ్లీ ఆ పార్టీల నాయకులు వస్తరు.. ఎన్నికలు రాగానే ఊపుకుంటూవచ్చి ఉపన్యాసాలు ఇస్తరు. గతంలో చేసిందేమీ లేదు కానీ మా తాతలు నేతులు తాగిండ్రు, మా మూతుల వాసనలు చూడండి.. మేం చాలా పెద్దవాళ్లం.. ఏడెనిమిది సార్లు మేం ఏమో చేసినం అని చెప్పడానికి వస్తరు. దయచేసి వారిని నమ్మొద్దు.. విశ్వసించొద్దని నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ సూచించారు.
వీళ్లందరిని చూసి చూసి, వీళ్ల అసమర్థతను తిరస్కరించి చాకు లాంటి నాయకుడికి అవకాశం ఇచ్చారు. మీ నాయకుడిని కాపాడుకోండి.. ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న నాయకుడు.. బ్రహ్మాండంగా సేవలందించే నాయకుడు నోముల భగత్ అని కేటీఆర్ ప్రశంసించారు. మీకు ఏ సమస్య వచ్చినా.. మీ ఇంటి ముందు వాలిపోయే యువ నాయకుడు భగత్ అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి నాయకుడితో పది కాలాల పాటు సేవ చేయించుకోండని కేటీఆర్ సూచించారు.