హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికను ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడారు. మొనగాళ్లకు, మోసగాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, తెలంగాణ పురోగతికి పట్టం కడుతారనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సవ్యంగా వాడండి. ఆగం కాకండి. ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అహంకారానికి మధ్య జరుగుతున్న సమరంలో.. పెద్ద ఎత్తున పని చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వశక్తులు ఒడ్డి, బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టి పెట్టి, ఎన్నో ప్రయత్నాలు, కుయుక్తులు కుట్రలు పన్ని రాజ్యాంగ సంస్థలను తన ఆధీనంలో పెట్టుకుని, ఎన్నికల గుర్తుల విషయంతో పాటు, మా మంత్రిని ప్రచారానికి రాకుండా ఆపారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారు. అదే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్న వామపక్షాల నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.
బీజేపీ నాయకులు నిన్ననేమో టీఎన్జీవోల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గంగా అవమానించారు. ఇవాళ టీఎన్జీవో కార్యాలయంపైన కూడా దాడి చేయించే ప్రయత్నం చేశారు. ఇవాళ మనుగోడు మండలం పలివెలలో దాడులకు దిగారు. గెలుస్తలేమని బోధ పడిన తర్వాత, చిల్లరగా భౌతికదాడులకు దిగింది బీజేపీ. ఆ దాడుల్లో టీఆర్ఎస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారేలా దాడులు చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పరిష్కారం కానీ పనులను చేసి చూపించామని కేటీఆర్ తెలిపారు. తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మునుగోడుకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం చూపించాం. ఫ్లోరోసిస్ ను నిర్మూలించాం. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అనాథలా మునుగోడును వదిలిపెట్టినప్పటికీ, అభివృద్ధి, సంక్షేమం ఆగలేదు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేశాం. శివ్వన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కృష్ణా జలాల విషయంలో మోదీ తాత్సరం చేస్తున్నారు. ఒక వేళ అది పూర్తి చేసి ఉంటే ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యేవి. ఇంటింటికీ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నరేంద్ర మోదీ యువతను నమ్మించి మోసం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దండు మల్కాపురంలో అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్నాం. చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ దమ్మిడి పని కూడా చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు క్రూరంగా, కిరాతకంగా ప్రవర్తించారు. ఫ్లోరోసిస్ బాధితులను పట్టించుకోలేదు. రక్షిత మంచినీటి కోసం నిధులు ఇవ్వమంటే కేంద్రం 19 పైసలు కూడా మంజూరు చేయలేదు. జేపీ నడ్డా 300 పడకల ఆస్పత్రి పెడుతానని చెప్పిండు. కానీ నోచుకోలేదు. శివ్వన్నగూడెం, లక్ష్మాణాపురం ప్రాజెక్టులకు నయా పైసా సహాయం చేయలేదు. కృష్ణా జలాల్లలో వాటా తేల్చకుండా సతాయిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలను చావుదెబ్బ కొడుతున్నారు. ప్రధాని మోదీ చేనేతకు మరణ శాసనం రాస్తున్నారు. నేతన్నలను కేసీఆర్ కాపాడుకుంటున్నారు. రైతులను మోదీ పట్టించుకోవట్లేదు. రుణాలు మాఫీ చేయడం లేదు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను చావగొట్టారు. రైతు ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి, ఇవాళ క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నాడు. కన్నీళ్లు, కష్టాలు, పెట్టుబడి డబుల్ అయింది. తెలంగాణలో పండిన వడ్లు కొనం కానీ, తెలంగాణ ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొంటామని ఢిల్లీ నుంచి బ్రోకర్లను పంపించారని కేటీఆర్ మండిపడ్డారు.
మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలి. ఎటు వైపు ఉండాలో ఆలోచించుకోని ఓటు వేయండి. బీజేపీ ప్రలోభాలకు లొంగకండి. కెలికి కయ్యం పెట్టుకుని ఓటర్లను ఆందోళనకు గురి చేస్తారు. టీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించండి. అందర్నీ ఆశ్చర్యపరిచేంత మంచి మెజార్టీతో గెలుస్తాం. మళ్లీ 6వ తేదీన కలుసుకొని మాట్లాడుకుందామని చెప్పి కేటీఆర్ తన ప్రెస్ మీట్ను ముగించారు.