హైదరాబాద్ : తెలంగాణకు నిధుల కేటాయింపులపై పచ్చి అబద్ధాలాడి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన అమిత్ షా కాదు.. అబద్ధాల బాద్ షా అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గత కొద్దికాలంగా తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తోంది. ఒక్కో టూరిస్టు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వెళ్తున్నారు. వారికి ఇక్కడి పరిస్థితులు వారికి తెలియవు. ఎయిర్పోర్టులోనూ, పార్టీ కార్యాలయాల్లోనూ చక్కగా బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయతక్వం రాసిచ్చిన స్ర్కిప్టు చదువుతున్నారు. దాంట్లో సత్యం ఉందా? అసత్యం ఉందా? అనే విషయం తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నారు. గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారని తీవ్ర స్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు.
నిన్న అమిత్ షా వచ్చి మాట్లాడిన మాటలు, చెప్పిన అబద్ధాలు చూస్తుంటే ఆయన పేరును కచ్చితంగా మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు. ఆయన అమిత్ షా కాదు.. అబద్ధాల బాద్ షా. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటంటే నిజం లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. పనికిమాలిన మాటలు చెప్పిండు. తెలంగాణకు పనికొచ్చే మాట చెప్పలేదు. తుక్కుగూడలో చెప్పిన తుక్కు డిక్లరేషన్.. తప్పుడు మాటలు నమ్మడానికి విశ్వసించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. 2014, 2018 ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూశారు. 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. క్షేత్రస్థాయిలో బలం లేదు. కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడి తప్పుదోవ పట్టించడం సరికాదు. వాట్సాప్ వర్సిటీలో తిరిగే విషయాలను వాస్తవాలుగా భ్రమింప చేసే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇంత అవినీతి ప్రభుత్వాన్ని దేశంలోనే చూడలేదని అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి పీఠం కోసం కేంద్ర అధిష్టానం రూ. 2500 కోట్లు అడిగినట్లు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. పత్రికల్లో వచ్చిన మాట ఇది అని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యే ఇప్పటి వరకు సస్పెండ్ కాలేదు.. చర్యలు తీసుకోలేదు.. బీజేపీ అధిష్టానం ఖండించలేదు. పదవులు అమ్ముకునే ఓ చిల్లర పార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హిందూ మఠాల వద్ద 30 శాతం కమీషన్ ఇవ్వనిదే నిధులు రావని ఓ పీఠాధిపతి చెప్పిన మాట ఇది. కర్ణాటకలో కాంట్రాక్టర్లను కూడా వేధిస్తున్నారు. 40 శాతం కమిషన్ అడుగుతున్నారు. మంత్రి ఈశ్వరప్ప వేధింపులు తట్టుకోలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మనం గుర్తించాలి. అదే కర్ణాటకలో 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే టూరిజం మంత్రి ఓ ప్రాజెక్టును ఆపేశారు. ఇప్పుడు చెప్పండి ఎవరిదీ అవినీతి ప్రభుత్వమని కేటీఆర్ నిలదీశారు.
చైతన్యవంతమైన తెలంగాణలో పిచ్చి మాటలు మాటట్లాడొద్దని అమిత్ షాను హెచ్చరిస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ప్రభుత్వాలు, మంత్రుల నుంచి ప్రజలు రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారు. రాజకీయ నాయకుల షోను ప్రజలు కోరుకోవడం లేదు. స్థాయిని మరిచి మాట్లాడుతామంటే కదురదు. ఈ 8 ఏండ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని కోరాం. 27 ప్రశ్నలతో ఓ లేఖ కూడా రాశాను. దానికి గురించి ఒక్క మాట లేదు. నిజం చెప్పండంటే నిజాం గురించి చెప్తాడు. నిజాంను ఆయన వారసులు, మనుమండ్లు తలుచుకుంటున్నారో లేదో.. కానీ బీజేపీ నాయకులు మాత్రం నిరంతరం నిజాంను తలుచుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఆర్థిక శాఖ గణాంకాలను తీసుకొని కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయో చెప్పానని కేటీఆర్ తెలిపారు. కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది.. రూ. 3 లక్షల 65 వేల 797 కోట్లు.. కానీ తిరిగి వచ్చింది కేవలం రూ. లక్షా 68 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం, ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎంపీ అరవింద్ మే 5వ తేదీన మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన దాని కంటే మోదీ 24 వేల కోట్లు ఎక్కువ ఇచ్చారని చెప్పారు. అంటే రూ. 3 లక్షల 94 వేల 147 కోట్లు ఇచ్చారని చెప్పారు. అమిత్ షానేమో మే 14న.. రూ. 2 లక్షల 52 వేల 202 కోట్లు ఇచ్చామని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డినేమో రూ. 4 లక్షల 11 వేల 18 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. ఎవరి మాట నమ్మాలి. ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడారు. వీళ్లది అబద్దపు బతుకు. వీల్ల పార్టీకి ఓ విధానం లేదు. నోటికొచ్చినట్లు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.