ఇద్దరు నిరుపేద విద్యార్థినులకు మంత్రి కేటీఆర్ ఆర్థిక భరోసా
ఎంబీబీఎస్ చదివేందుకు ప్రోత్సాహం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ఒక విద్యార్థిని రైతుబిడ్డ.. ఇంకో విద్యార్థిని కూలీ బిడ్డ.. వీరిద్దరు బాగా చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. కానీ, కాలేజీలో చేరేందుకు ఆర్థిక స్థోమత సహకరించలేదు. విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు వారిద్దరికి అండగా నిలిచారు. ఉన్నత చదువుకు డబ్బు అడ్డుకావొద్దని ఆర్థిక సహాయం చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రాజాపూర్కు చెందిన ఆవునూరి అఖిల 98 శాతం మార్కులతో ఇంటర్ పాసైంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకొన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన స్పందన ఇంటర్లో 95 శాతం మార్కులు తెచ్చుకొన్నది. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో సీటు సాధించింది. పేదరికం వీరి ఉన్నత చదువులకు అడ్డుగా మారింది. నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష కాకూడదని భావించిన మంత్రి కేటీఆర్.. ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సోమవారం ప్రగతిభవన్కు పిలిపించుకొని ఆర్థిక సహాయం అందజేశారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకొనేవారికి పరిమితులు, పేదరికం అడ్డుకావని నిరూపించిన అఖిల, స్పందనను మంత్రి అభినందించారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కల నెరవేర్చాలని, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని, పదిమందికి స్ఫూర్తిగా నిలవాలని విద్యార్థినులను దీవించారు. కాగా, మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం చేయటంతో ఎంబీబీఎస్ కల సాకారం అవుతున్నదని, మంత్రి తమను పిలిచి మరీ సహాయం అందిస్తారని కలలో కూడా ఊహించలేదని అఖిల, స్పందన పేర్కొన్నారు.