హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష నాయకులే తమకు బ్రాండ్ అంబాసిడర్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు. పాదయాత్రల్లో భాగంగా వారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోల్లో కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. దీంతో వారికి పరోక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఐటీ, పరిశ్రమ రంగాలపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే రంగంలో ఐటీ, పరిశ్రమల రంగం ఒకటి అని చెప్పొచ్చు. మన రాష్ట్రానికి జరుగుతున్న మంచి పనులను రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే స్వాగతించాలి. ప్రపంచం మొత్తం నాలుగో పారిశ్రామిక విప్లవం ముంగిట మనం ఉన్నాం. స్టీమ్ ఇంజిన్ రైలు కనుగొనబడినప్పుడు మొదటి పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఎలక్ట్రిక్ శక్తితో రెండో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ రెండు విప్లవాలను దేశం అందుకోలేకపోయింది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లతో మూడో పారిశ్రామిక విప్లవం వచ్చింది. దీన్ని కొంత అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవం ముంగిట ఉన్నాం. ఇప్పుడు ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే అవకాశం భారతదేశానికి ఉంది.
నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతదేశం అందిపుచ్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. టెలికం రంగంలో విప్లవం వచ్చింది. భవిష్యత్లో 3డీ ప్రింటింగ్తో చిన్నచిన్న సైజు ఇండ్లను నిర్మాణం చేసే అవకాశం ఉంది. డిజిటల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతికత నిష్ఫలం అని సీఎం కేసీఆర్ చెబుతారు. ఐటీ రంగంలో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా ఒప్పుకున్నాయి.
ఒకాయన నిరుద్యోగ గర్జన, మరొకరు మిలియన్ మార్చ్ చేస్తామని అంటారు. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో అసాధారణ అభివృద్ధి జరిగింది. సాగునీటి రంగంలో సాధించిన విజయాలను కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నది అని ఆర్బీఐ, నీతి ఆయోగ్ నివేదికలు విడుదల చేసింది. ప్రపంచంలోని ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా.. 5 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. మన జనాభా 4 కోట్లు అనుకుంటే.. ఒక రెండు శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రయివేటు రంగంపైనే ఆధారపడాలి. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు కల్పించాలి తప్ప వేరే దారి లేదు. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం వల్లే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించి, టీఎస్ ఐపాస్ అనే పాలసీని తీసుకొచ్చారు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.