హైదరాబాద్: అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిఫెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు తరలించారని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్జ్లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.. ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పారు. దేశ రక్షణ రంగంలో హైదరాబాద్లోని రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర అని చెప్పారు. వెమ్ టెక్నాలజీలో సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. సీఎస్ఆర్లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.