హైదరాబాద్, జనవరి 5: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నెటిజన్లు ఓ ఆటాడుకొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరోనా నిబంధనలు ఉల్లంఘించి జైల్లో పడితే, ఆయనకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ అంటూ హంగామా సృష్టించారు. పోయి పోయి దేశానికే ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథపై ఆరోపణలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు తమదైన శైలిలో నడ్డాపై నిప్పులు చెరిగారు. తాండ్ర ప్రవీణ్ అనే వ్యక్తి.. ‘మొన్నటిదాకా బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ ప్రజల పరిస్థితి ఇది. కనీసం మంచి నీళ్లు ఇచ్చే సోయిలేని అబద్ధాల పార్టీ ఈ బీజేపీ’ అని ఓ ఫొటోను జత చేశారు. కుషీ సమ్ము అనే ఆవిడ.. ‘బీజేపీ దొంగ కథలు.. ఒక దొంగ నీతి కథలు చెప్పడానికి మరో దొంగ వచ్చాడు. తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా’ అని కామెంట్ చేశారు. ఓ ఫొటో జత చేసి.. అందులో ‘750 రైతు కుటుంబాల కోసం క్యాండిల్ ర్యాలీ చెయ్యవా? నల్లచట్టాలు తెచ్చి బలి తీసుకున్న రైతుల ప్రాణాలు గుర్తుకులేవా? లఖింపూర్ ఖేర్ ఘటనలో అమరులైన రైతులకు సంఘీభావం తెలపవా? ఒక జోకర్ జైలుకి పోతే రాష్ర్టాలు దాటి హైదరాబాద్ వచ్చే తీరిక మాత్రం ఉంది’ అని నడ్డాపై ఫైర్ అయ్యారు. రామకృష్ణగౌడ్ అనే వ్యక్తి.. ‘అయ్యా జేపీ నడ్డా గారు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా క్యాండిల్ లైట్ ర్యాలీ చేయరాదు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేలా ఓ కొవ్వొత్తి వెలిగించరాదు.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెస్తానని ఓ ముచ్చట చెప్పరాదు.. ఆంధ్రాలో కలిపిన మా ఏడు మండలాలను ఇప్పియ్యరాదు.. గివి చెప్పకుండా, గీడ రాజకీయం చేసేతందుకు వస్తే, సప్పట్లు కొట్టి, స్వాగతించమంటవా?’ అని నిలదీశారు. నడ్డా తీరుపై మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నడ్డాపై నిప్పులు చెరిగారు. ‘నడ్డా.. అబద్ధాలకు అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ను నెటిజన్లు ట్రెండ్ చేస్తూ ట్వీట్లు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ‘జేపీ నడ్డా అబద్ధాలకు కేరాఫ్ అడ్డా. ఇక ఎర్రగడ్డే అడ్డా. కేటీఆర్ అన్న మాస్’ అని ఆశప్రియ ముదిరాజ్ అనే యువతి కేటీఆర్ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కామెంట్ చేశారు.