Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలకు నియ్యతి ఉంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఇవాళ మార్చి 27 సరిగ్గా నెల తర్వాత ఏప్రిల్ 27న పార్టీ పుట్టిన రోజు. నేను అందరికీ కోరేది ఒకటే. కేసీఆర్ ఎప్పుడూ ఒకటే చెబుతారు. రాజకీయాల్లో నేలవిడి సాము చేయొద్దని అని చెబుతారు. యాడనే ఏదో ఉందని దాని వెనుక ఉరుకుడు కాదు. మీ కుటుంబ సభ్యులు 60లక్షల గులాబీ దండు ఏదైతే ఉన్నదో వాళ్లను కలుసుకోండి.. వాళ్లను ఆళింగనం చేసుకోండి.. వాళ్లతో సమయం గడపండి. వాళ్ల కష్ట సుఖాలను తెలుసుకోండి.
వాళ్ల ఫీడ్బ్యాక్తో బ్రహ్మాండంగా వంద సీట్లు ఎందుకు రావో మళ్లీ 2023లో చేసి చూపిద్దాం.. అనే మాట కేసీఆర్ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 27 నాటికి సరిగ్గా పార్టీకి 22వ వసంతంలో అడుగుపెట్టేనాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉండే 60లక్షల మంది గులాబీ సైనికులందరికీ మమేకం కావాలని కేసీఆర్ ఆదేశించారు. మమేకం కావడమంటే మీటింగ్ పెట్టి ఉపన్యాసమిచ్చి పోడువు కాదు. ముఖ్యమంత్రి చెప్పింది ఇది సన్నాహక సమావేశం మాత్రమే. సూచనలు ఇచ్చేందుకు పెట్టుకున్న కార్యక్రమం. ఆత్మీయ సమ్మేళనం అంటే గంటో రెండు గంటలు కాదు. భోజనానికి విరామం ఇచ్చి.. భోజనం తర్వాత కూడా మళ్లీ రెండు మూడు గంటల పాటు కూర్చోండి.. ఇంతకు మించి పెద్ద పని లేదని కఠినంగా చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయ్. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలతో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఊర్లను యూనిట్లుగా తీసుకొని మీటింగ్లు పెట్టుకోవాలి’ అని నేతలకు సూచించారు.
‘రాజన్న సిరిసిల్ల జిల్లాలో గులాబీ దండు సంఖ్య 1.72లక్షలు ఉన్నది. మనం చేయాల్సింది ఒక్కటే. 1.72లక్షల మందిని తట్టిలేపి కలిపి.. మీటింగ్కు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరిని తీసుకున్నా అదే పెద్ద సైన్యం. మూడు, నాలుగువేల మందితో కలిపి సావధానంగా ఐదారుగంటలతో కార్యకర్తలతో మాట్లాడి. మనం ఒకటి పునశ్చరణ చేసుకోవాలి. యాడ ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం? ఎక్కడ ప్రారంభమైంది? తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇనాడు భారత రాష్ట్ర సమితిగా ఎట్లా ముందుకుపోతున్నది ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. దాంతో పాటు 2014 తర్వాత మీ ఊరు ఎలా అయ్యింది? మీ ఊరు చెరువు ఆ నాడు ఎలా ఉండే.. ఈనాడు ఎలా అయ్యింది? మీ ఊరి బడి.. ఆనాడు ఎలా ఉండే.. ఈనాడు ఎట్లా ఉంది? పారిశుధ్యం, మంచినీళ్లు, కరెంటు పరిస్థితి, సాగునీటి వనరులు, రైతులు, కులవృత్తుల పరిస్థితి అప్పుడు ఎలా ఉండే?.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలి.
ఆనాడు ప్రభుత్వం ఏం చేసింది.. నేడు ప్రభుత్వం ఏం చేస్తున్నదో రైతన్నలు, గౌడన్నలు, గంగపుత్రులతో చర్చలు పెట్టాలి. ఆ నాటి పరిస్థితి సిరిసిల్లలో ఏంటీ? ఇప్పుడు సిరిసిల్లలో పరిస్థితి ఏంటో నేతన్నలు చర్చలు పెట్టాలే. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని యాది చేయాలి. దళితుల సోదరులతో కూర్చొని.. దళితబంధులాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? అని ఆలోచన చేయాలని కోరాలి. తండాలు, గూడెలు జీపీలు కావాలని ఏళ్లుగా కోరారని.. సీఎం కేసీఆర్ చలవతో గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారి.. ఇవాళ సర్పంచులయ్యారు. ఆయా కార్యక్రమాలపై చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒక్కో పార్టీ, ప్రభుత్వం 25, 30 ఏళ్లలో చేయలేని పని మనం ఎనిమిదేళ్లలో చేసినమాట అక్షరసత్యం. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చుడు ఈ దేశంలో ఎవరితోనూ కాలేదు. పల్లె, పట్టణం అల్కటి పని అయితే.. మనకంటే ముందున్నవాళ్ల ఎందుకు చేయలేదు? ఆలోచన చేయాలని అడగాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘ఒకనాడు ఇదే సెస్ పరిధిలో కరెంటు పరిస్థితి ఎట్లుండే..? ఇవాళ కరెంటు సరఫరా ఎట్లా ఉందని అడగాలి. 2014కు ముందు మీ ఊళ్లో పరిస్థితి ఏందీ? కేసీఆర్ వచ్చాక పరిస్థితి ఏందీ అని అడగాలి. పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలపై అడగాలి. హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఊరు లేదనే మాట అక్షరసత్యం. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ వాళ్ల ఇండ్లల్లోకి సైతం భగీరథ నీళ్లు వస్తున్నయ్. రైతుబంధు ద్వారా ఖాతాల్లో బ్రహ్మాండంగా పడుతున్నయ్. చొప్పదండిలో బీజేపీ నేత చనిపోతే రైతుబీమా కింద రూ.5లక్షల వచ్చాయ్. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కును తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లి.. కేసీఆర్ పంపాడమ్మా రూ.5లక్షల చెక్కు. మీ మోదీ రూ.15లక్షలు అన్నడు పత్తాలేవు కానీ.. కేసీఆర్ పైసలు తీసుకోమంటూ ఇచ్చి వచ్చాడు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు సైతం నియ్యతి ఉంటే ఓటు మనకే వేయాలి. వాళ్లకు అన్నీ వస్తున్నయ్. వాస్తవాలన్న వాళ్లకు తెలుసు. నోటికి వచ్చినట్లు మాట్లాడుడు.. తీయ్యటి, పుల్లటి మాటలు, డైలాగులు కొట్టడం అల్కటి పని. పని చేసి ఇది సాక్ష్యం అని చెప్పుడు కష్టం. ఆవివరాలు సావధానంగా పథకాల వివరాలు వివరించారు. ప్రతి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం చదివి వినిపించాలి’ అని సూచించారు.
‘భూమి ఉన్నంత కాలం, భూగోళంపై మనిషి ఉన్నంత కాలం, ఆ మనిషికి మనసున్నంత కాలం సమస్యలు వస్తనే ఉంటయ్. నేను ఏడెనిమిదేళ్లు అమెరికాలో ఉన్న. టీవీల్లో, పేర్లలో అమెరికాల్లో ఇట్లా, గట్లనటా.. చిన్న చిన్న పనులు చేసేవారు కార్లలో వస్తరట.. భూతల స్వర్గమని చెప్పుతారు అమెరికా గురించి. వాస్తవానికి అమెరికాలోనూ సమస్యలున్నయ్. అమెరికాలో ప్రభుత్వాలకు చికాకులు, నెత్తినొప్పులు, నిరంతరం ప్రతిపక్షం ఉంటది.. ఇది చేయలే అది చేయలే అని లొల్లి నడుస్తనే ఉంటది.
సమస్యలు ఒడిసిపోతయ్.. ఏం లేదని అనడం తప్పుడు. సమస్యలు మనిషి ఉన్నంత కాలం.. ఆ మనిషికి మనసు ఉన్నంత కాలం ఉంటాయ్. మన ప్రభుత్వం చేసిన పనులు.. భారతదేశంలో ఎక్కడా ఇంత పని జరుగలేదు. ప్రభుత్వం చేస్తున్న పనులపై వివరించి ప్రతిపక్షం నోరు మూయించాలి. ఇక్కడికి వస్తున్న సమయంలో డాక్టర్ దవాఖాన.. పెట్టానంటే ప్రారంభించి వెళ్తున్న సమయంలో నలుగురు పిల్లలను బీజేపీ వాళ్లు పంపారు. వారిని పోలీసోళ్లు తీసుకుపోయారు. కానీ, కొద్దిసేపు ఒక విషయం నాకు అర్థం కాలేదు. పాపం ఆ పిల్లలకు ఏం తెలుసు. బండి సంజయ్.. బొండి సంజయో ఏదో మొత్తకుంటే.. పిల్లలు రెచ్చిపోయి వాట్సాప్లో చూసింది నిజమనుకొని ఉరికి వస్తున్నరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.