హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు తీర్మానం చేసేలా చేసిన ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు. ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను గురువారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో మహేశ్ బిగాల ఇటీవల ప్రత్యేక జూమ్ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా మహేశ్ బిగాల మంత్రికి వివరించారు. రెండు వారాలపాటు తాను చేసిన యూరప్ పర్యటన విశేషాలను ఆయన మంత్రి కేటీఆర్కు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులను కలిసి.. దేశ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించి, జాతికి నాయకత్వం అందించాలనే ఆశాభావంతో ఉన్నారని ఆయన మంత్రికి వివరించారు.