హైదరాబాద్ : కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై కేటీఆర్ చేసిన ట్వీట్కు మంచి స్పందన రాగా, 70 శాతం పైచిలుకు ప్రజలు కలిపితేనే బాగుంటుందని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు మురుగు నీరు శుద్ధి, మంచినీటి సౌకర్యం కోసం ఒకే రోజు రూ. 5000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేటీఆర్ సంబంధిత జీవోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ విలీన అంశంపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
కంటోన్మెంట్ ఏరియా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో లేదు. సమన్వయ సమస్య తమకే కాదు ప్రజలకు కూడా ఉందన్నారు. అక్కడ రోడ్లు మూసివేస్తారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పెరగనప్పుడు సమస్య తీవ్రత వేరు. ఇప్పుడు కంటోన్మెంట్ చుట్టూ లక్షల మంది జనాలు ఉన్నారు. టీఎస్ బీసాస్, అన్నపూర్ణ సెంటర్లు అక్కడ అమలు కావు. నగరమంతా ఫ్లై ఓవర్లు, స్కైవేలు కడుతున్నాం. ఆ ప్రాంతంలో కడుదామంటే మాత్రం అడ్డంకులు వస్తున్నాయి. ఏడేళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ అంశాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రస్తావిస్తే.. కంటోన్మెంట్ అధికారులు సహకరించరు.. ముందుకు రారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ ల్యాండ్కు సమామైన ల్యాండ్ ఇస్తామని చెప్పినా కూడా ఒప్పుకోవడం లేదు. ఈ విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒకట్రెండు కాదు 40 రోడ్లు మూసివేశారు. కంటోన్మెంట్ విలీన అంశంపై నిన్న ఒక రెండు పేపర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి వార్తలు వచ్చాయి. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపిస్తేనే మంచిదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడినట్లు ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు తాను సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను కోరాను. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో కలిపితేనే బాగుంటుందని 70 శాతం పైచిలుకు ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం.
ఎన్నికలు ఉన్నప్పుడే ఇలాంటివి గుర్తు వస్తాయని ఓ పత్రిక రాసింది. మాకు ఎన్నికలప్పుడే కార్యక్రమాలు చేసే అలవాటు లేదు. ఎన్నికలు లేనప్పటికీ ఇవాళ ఐదు వేల కోట్లు విడుదల చేశాం. ఎన్నికలతో పని లేకుండా పని చేసుకోని పోవడమే మా సిస్టం. ప్రజాభిప్రాయం స్పష్టంగా ఉంది. మెజార్టీ ప్రజాభిప్రాయం విలీనానికి అనుగుణంగా ఉంది. దీనిపై సీఎం కేసీఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే, బోర్డు మెంబర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.